ఘన నివాళి అర్పించిన మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు
అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు విజయవాడలోని క్యాంప్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలుగు ప్రజల స్వాభిమానానికి ప్రతీకగా నిలిచిన పొట్టి శ్రీరాములు త్యాగం భారత చరిత్రలో చిరస్మరణీయమని అన్నారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ఆయన చేసిన నిరాహార దీక్ష, అచంచల సంకల్పం తెలుగు జాతి చరిత్రలో అజరామరంగా నిలిచిపోయిందని కొనియాడారు. పొట్టి శ్రీరాములు మహోన్నత త్యాగానికి గుర్తింపుగా నేడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతిలో 58 అడుగుల ఎత్తైన కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించడం చారిత్రాత్మక ఘట్టమని మంత్రి తెలిపారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి చిహ్నంగా నిలిచేలా ఈ విగ్రహం తరతరాలకు స్ఫూర్తినిస్తుందని పేర్కొన్నారు. 1952లో ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ఆయన 58 రోజులపాటు నిరాహార దీక్ష చేసి తన ప్రాణాలను అర్పించారు. ఆయన త్యాగం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమై, చివరకు 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడేందుకు మార్గం సుగమమైంది. భాషా ఆధారంగా రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణకు కూడా ఆయన త్యాగం ప్రధాన కారణంగా నిలిచింది. ఆయన త్యాగం వల్లే ఆంధ్ర రాష్ట్ర ఆవిర్భావం సాధ్యమైందని, తెలుగు జాతి చరిత్రలో ఆయన స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. యువత ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకుని సమాజ సేవలో ముందుకు రావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
