తూర్పు గోదావరి జిల్లాలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి, రాబోయే ఎన్నికల్లో ఘన విజయం సాధించడమే లక్ష్యంగా పనిచేస్తామని రాజమండ్రి పార్లమెంట్ కోఆర్డినేటర్ టీకే విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. స్థానిక మున్సిపల్ కాలనీలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తనపై విశ్వాసంతో ఈ బాధ్యత అప్పగించిన ఎఐసిసి నాయకత్వానికి, పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిళారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. రాజమండ్రి పార్లమెంట్తో పాటు జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ విజయమే ధ్యేయంగా పనిచేస్తామని పేర్కొన్నారు. త్వరలో నియోజకవర్గాల పర్యటన చేపట్టి, ‘ఘర్ వాపస్ ఆవో’ నినాదంతో గతంలో పార్టీలో పనిచేసిన నాయకులు, కార్యకర్తలను తిరిగి పార్టీలోకి తీసుకువస్తామన్నారు. ఈ సందర్భంగా సీనియర్ నాయకులు ఎండి రఫీ చేతులమీదుగా నియామక పత్రం అందుకున్నారు. పలువురు నాయకులు పుష్పగుచ్చాలు, దుశ్శాలువాలతో టీకే విశ్వేశ్వరరెడ్డిని సత్కరించారు. ఇదే వేదికపై క్రిస్టియన్ మైనార్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సింధియా రాణికి నియామక పత్రం అందజేశారు.
