– విత్తనాలు ఇచ్చి పుచ్చుకునే విధానం అమలు చేయాలి
-జలవనరులను సద్వినియోగం చేసుకోవాలి
– డాక్టర్ శశిప్రభ, సిఇఒ, సిఫా ట్రస్ట్ ప్రకృతి ఆధారంగా పంటలు పండించడం అవసరం అని సిఫా ట్రస్ట్ సిఇఒ డాక్టర్ శశిప్రభ అన్నారు. శనివారం ఉదయం అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం లమ్మసింగి మండలం భీమనాపల్లి గ్రామంలో చిరుధాన్యాలు, అల్లం, పసుపు పంపిణీ చేసిన అనంతరం ఆదివాసీలతో మాట్లాడారు. విత్తనాలు ఇచ్చి పుచ్చుకునే విధానం అమలు చేయాలన్నారు. దేశీయ విత్తన సంపత్తిని కాపాడుకోవాలని కోరారు. చాలా జలవనరులు వృధాగా పోతున్నాయని వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆదివాసీ రైతులు కొండ వాగులు పొలాలకు మళ్ళించి సంవత్సరం పొడవునా పంటలు పండించడం అవసరం అని పేర్కొన్నారు. చింతపల్లి, కొయ్యూరు మండలాల్లో పలు గ్రామాల్లో గడిచిన మూడు సంవత్సరాలుగా దేశంలో విభిన్న ప్రాంతాల నుండి దేశీయ విత్తనాలు సేకరించి ఆదివాసీలకు పంపిణీ చేశామన్నారు. తమ సంస్థ ద్వారా ప్రకృతి ఆధారంగా పంటలు పండించే విధానం నిరంతరం శిక్షణ ఇస్తున్నామని వివరించారు.
ఈ కార్యక్రమంలో గ్రీన్ క్లైమేట్ టీం ఎన్ జి ఒ వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం, సి ఫాం సంస్థ ప్రతినిధులు నర్సింగ్, మూర్తి తదితరులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో ముందుగా కొయ్యూరు మండలం ధర్మవరం లో కొబ్బరి మొక్కలు నాటి గట్టు వ్యవసాయ పద్ధతులు వివరించారు. అలాగే చింతపల్లి మండలం నూతిబంద, అసరాడ గ్రామాలు సందర్శించి ఆదివాసీలతో మాట్లాడారు.
