నేడు టిడ్కో గృహాల ప్రారంభ మహోత్సవం
` రూ.323 కోట్లతో నిర్మించిన 3600 గృహాలు లబ్ధిదారులకు అందజేత
ఏపీ పట్టణ నివాస సముదాయములు, మౌళిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో విశాఖ జిల్లాలో సోమవారం భారీ స్థాయిలో టిడ్కో గృహాల పంపిణీ కార్యక్రమాలు జరగనున్నాయి. పేదలకు సొంతింటి కలను నెరవేర్చాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని ఈ కార్యక్రమాన్ని వేగవంతం చేసింది. జిల్లాలో మొత్తం రూ.323 కోట్లకు పైగా వ్యయంతో నిర్మించిన 3600కు పైగా గృహాలను అర్హులైన లబ్ధిదారులకు అందజేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. భీమిలి నియోజకవర్గంలోని కొమ్మాది వద్ద రూ.30.55 కోట్ల వ్యయంతో నిర్మించిన 336 ఫ్లాట్లు, పెందుర్తి నియోజకవర్గంలోని మంత్రిపాలెం వద్ద రూ.33.60 కోట్లతో నిర్మించిన 336 ఫ్లాట్లు లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు. అలాగే గాజువాక నియోజకవర్గంలోని తలారివానిపాలెం, దువ్వాడ, పెదగంట్యాడ ప్రాంతాల్లో రూ.253.88 కోట్ల వ్యయంతో నిర్మించిన 2928 ఫ్లాట్లు లబ్ధిదారులకు అందజేస్తారు. జిల్లా వ్యాప్తంగా నిర్వహించే ఈ కార్యక్రమాల్లో స్థానిక ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొని లబ్ధిదారులకు గృహాల పట్టాలను అందజేస్తారు. పట్టణ ప్రాంతాల్లో పేదలకు గౌరవప్రదమైన నివాస వసతి కల్పించడం లక్ష్యంగా ప్రభుత్వం చేపడుతున్న టిడ్కో గృహాల నిర్మాణ కార్యక్రమం కీలకంగా కొనసాగుతోందని టిడ్కో ఈఈ సుధాకర్ పేర్కొన్నారు.
స్థిర నివాస భద్రత లభిస్తుంది: జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్
ఈ గృహాల పంపిణీతో అనేక కుటుంబాలకు స్థిర నివాస భద్రత లభిస్తుంది. వారి జీవన ప్రమాణాలు మరింత మెరుగుపడతాయి. ఎంతో కాలం నుంచి చూస్తున్న వారి ఆశలు నెరవేరుతాయి. విజయవంతంగా నిర్వహించేందుకు అందరి సహకారం అవసరం.
