నగరవాసుల నిత్య జీవితానికి బ్రేక్
ఉదయం–సాయంత్రం రహదారులపై వాహనాల తాళాలు
చిన్న దూరానికే గంటల ప్రయాణం
అభివృద్ధి నగరంగా పేరొందిన రాజమహేంద్రవరం నేడు ట్రాఫిక్ కష్టాల నగరంగా మారుతోంది. ఉదయం, సాయంత్రం రద్దీ వేళల్లో ప్రధాన రహదారులు పూర్తిగా స్తంభించిపోతున్నాయి. కోటిపల్లి బస్టాండ్, ఇన్నిస్పేట, దానవాయిపేట, గోకవరం బస్టాండ్, తాడితోట ప్రాంతాల్లో వాహనాల కదలిక నెమ్మదిగా మారి నగరవాసుల సహనాన్ని పరీక్షిస్తోంది. పాఠశాలలు, కళాశాలల ప్రారంభం–ముగింపు సమయాల్లో ట్రాఫిక్ పరిస్థితి మరింత తీవ్రంగా మారుతోంది. రెండు కిలోమీటర్ల దూరం ప్రయాణించాలంటే అరగంటకు పైగా సమయం పడుతుండటంతో ఉద్యోగులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
రోడ్ల వెడల్పు సరిపోకపోవడం, అక్రమ పార్కింగ్లు, ఆటోల నియంత్రణలేమి, బస్టాప్ల వద్ద బస్సుల అస్తవ్యస్త నిలుపుదల ట్రాఫిక్ జామ్లకు ప్రధాన కారణాలుగా మారాయి. కూడళ్ల వద్ద ట్రాఫిక్ సిగ్నల్స్ సక్రమంగా పనిచేయకపోవడం సమస్యను మరింత పెంచుతోంది. అత్యవసర సేవలైన అంబులెన్స్లు, ఫైర్ ఇంజిన్లు ట్రాఫిక్లో చిక్కుకుని విలువైన సమయాన్ని కోల్పోతున్నాయి. పాదచారులకు సరైన ఫుట్పాత్లు లేకపోవడంతో ప్రమాదాల ముప్పు పెరుగుతోంది. నగరంలో పెరుగుతున్న వాహనాల సంఖ్యకు అనుగుణంగా శాస్త్రీయ ట్రాఫిక్ ప్లానింగ్ లేకపోవడమే ఈ సమస్యకు మూలకారణమని ప్రజలు ఆరోపిస్తున్నారు. అక్రమ పార్కింగ్పై కఠిన చర్యలు, వన్వే విధానం అమలు, సిగ్నల్స్ ఆధునీకరణ, ట్రాఫిక్ పోలీసుల సంఖ్య పెంపు వంటి చర్యలు తక్షణమే చేపట్టాలని నగరవాసులు డిమాండ్ చేస్తున్నారు.
ట్రాఫిక్ కష్టాల నుంచి రాజమహేంద్రవరం ఎప్పుడు విముక్తి పొందుతుందోనన్న ప్రశ్నకు మాత్రం ఇప్పటికీ సమాధానం దొరకడం లేదు.
రాజమహేంద్రవరం ట్రాఫిక్ జామ్..!
RELATED ARTICLES
