- సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారం
- హాజరైన రాష్ట్రపతి ముర్ము, మోడీ, మంత్రులు
న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ సోమవారం దేశ 53వ ప్రధాన న్యాయమూర్తి గా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము జస్టిస్ సూర్యకాంత్లో సీజేఐగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు. ఆయన జస్టిస్ బి.ఆర్. గవాయి స్థానంలో ఇటీవల సీజేఐగా నియమితులయ్యారు. నూతన సీజేఐ సూర్యకాంత్ ఫిబ్రవరి 9, 2027 వరకు పదవీకాలంలో కొనసాగుతారు. సుప్రీంకోర్టులో తన సుదీర్ఘ పదవీకాలంలో ఆయన అనేక ముఖ్యమైన, కీలక తీర్పులు ఇచ్చారు. హర్యానాలోని హిస్సార్లో ఒక సాధారణ కుటుంబం 10 ఫిబ్రవరి 1962న జన్మించిన జస్టిస్ సూర్యకాంత్ దేశ అత్యున్నత న్యాయస్థానం అత్యున్నత పదవికి చేరుకున్నారు. ఆయన హిస్సార్లో లా ప్రాక్టీస్ ప్రారంభించారు. తరువాత పంజాబ్- హర్యానా హైకోర్టులో ప్రాక్టీస్ కొనసాగించారు. 2018లో ఆయన హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక హోదా కల్పిస్తున్న ఆర్టికల్ 370ని రద్దు చేసే నిర్ణయాన్ని సమర్థించిన ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనంలో జస్టిస్ సూర్యకాంత్ ఒకరు. ఈ తీర్పు గత కొన్ని సంవత్సరాలలో అత్యంత చర్చనీయాంశమైన రాజ్యాంగ నిర్ణయాలలో ఒకటి. సెక్షన్ 124ఏ (దేశద్రోహం) పై స్టే విధించారు. కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని సమీక్షించే వరకు దానిని అమలు చేయవద్దని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశించిన ధర్మాసనంలో ఆయన ముఖ్యమైన పాత్ర పోషించారు. పెగాసస్ స్పైవేర్ కేసులో జస్టిస్ సూర్యకాంత్ విచారణ కోసం సైబర్ నిపుణులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలనే నిర్ణయం తీసుకున్నవారిలో ఒకరు. జాతీయ భద్రత పేరుతో ప్రభుత్వానికి అపరిమిత అధికారాలు ఇవ్వలేమని కోర్టు స్పష్టం చేసింది. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతను నిర్ధారించడానికి ఓటర్ల జాబితా నుండి తొలగించిన 65 లక్షల మంది పేర్ల పూర్తి వివరాలను బహిరంగపరచాలని ఆయన ఎన్నికల సంఘానికి ఆదేశించడం తెలిసిందే. ఒక మహిళా సర్పంచ్ను పదవి నుండి తొలగించడం చట్టవిరుద్ధమని పేర్కొంటూ ఆమె పదవిని జస్టిస్ సూర్యకాంత్ పునరుద్ధరించారు. మహిళలపై వివక్షతను అంగీకరించలేమని తన తీర్పులో పేర్కొన్నారు. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్తో సహా అన్ని బార్ అసోసియేషన్లలో 1/3 సీట్లను మహిళలకు రిజర్వ్ చేయాలని సూచించారు. ఇది ఒక చారిత్రాత్మక చర్యగా పరిగణిస్తారు. ఇటీవల గవర్నర్, రాష్ట్రపతికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని విషయాల్లో ప్రశ్నలు లేవనెత్తున్నాయి. గవర్నర్, రాష్ట్రపతి అధికారాలకు సంబంధించిన ముఖ్యమైన కేసులను విచారిస్తున్న రాజ్యాంగ ధర్మాసనంలో ఆయన ఒకరు. అయితే దీనిపై ఇంకా నిర్ణయం రావాల్సి ఉంది. 2022లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పంజాబ్ పర్యటన సందర్భంగా భద్రతా లోపం తలెత్తింది. దీనిపై జస్టిస్ ఇందు మల్హోత్రా అధ్యక్షతన విచారణ కమిటీని ఏర్పాటు చేయాలని జస్టిస్ సూర్యకాంత్ ఆదేశించారు. వన్ ర్యాంక్-వన్ పెన్షన్ OROP పథకానికి ఆయన రాజ్యాంగపరమైన గుర్తింపు ఇచ్చారు. ఈ నిర్ణయాన్ని ఆయన సమర్థించారు. న్యాయ వృత్తి, సంస్థలలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడం కాలాన్ని బట్టి అవసరమని, కాబట్టి బార్ అసోసియేషన్లలో రిజర్వేషన్లు అవసరమని ఆయన తన ప్రత్యేక తీర్పులో స్పష్టం చేశారు. అవమానకరమైన, తీవ్ర వ్యాఖ్యలపై పాడ్కాస్టర్ రణవీర్ ఇలాహాబాడియాను జస్టిస్ సూర్యకాంత్ హెచ్చరించారు. భావ ప్రకటనా స్వేచ్ఛ అంటే సామాజిక మర్యాదలను ఉల్లంఘించే హక్కు కాదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. జస్టిస్ సూర్యకాంత్ అనేక జాతీయ, అంతర్జాతీయ న్యాయ సంస్థలకు సహకరించారు. ఆయన నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ పాలక మండలిలో సభ్యుడిగా ఉన్నారు. వివిధ న్యాయ కమిటీలలో జస్టిస్ సూర్యకాంత్ చురుకైన పాత్ర పోషించారు.
