- చెవిరెడ్డికి అస్వస్థత
- వెరికోస్ వెయిన్ కు చికిత్స
- ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు
(విజయవాడ, జయజయహే)
వైసీపీ కీలక నేత చెవిరెడ్డి భాస్కర్రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. హుటాహుటిన ఆయనను వైద్య పరీక్షల కోసం విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గతకొంతకాలంగా వెరికోస్ వెయిన్స్తో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే చెవిరెడ్డి అస్వస్థతకు గురైనట్లు సమాచారం. ఆస్పత్రిలో ఆయనకు వైద్యం అందిస్తున్నారు. అనంతరం డాక్టర్లు మీడియాకు చెవిరెడ్డి ఆరోగ్య పరిస్థితి గురించి వివరాలు వెల్లడించే అవకాశాలు ఉన్నాయి. కాగా, వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో జరిగిన ఏపీ లిక్కర్ స్కాం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ కేసులో సంచలన విషయాలు బయటపడ్డాయి. ఈ కేసును సిట్ అధికారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అప్పగించారు. ఈ వ్యవహారంలో కీలకంగా ఉన్న వారిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. సిట్ అధికారులు అరెస్ట్ చేసిన వారిలో చెవిరెడ్డి కూడా ఉన్నారు. ఆయనను పలు దఫాలుగా సిట్ అధికారులు విచారణ చేశారు. ఈ విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు వార్తలు వచ్చాయి. మద్యం స్కాం ద్వారా చెవిరెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు భారీస్థాయిలో ఆస్తులను కొనుగోలు చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ ఆస్తులను జప్తుచేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే అధికారులకు ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది.
