దేశ సమైక్యత శిల్పి సర్దార్ వల్లబ్ భాయ్ పటేల్ చిరస్మరణీయులు
– జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి
గుంటూరు జయ జయహే దేశ సమగ్రతను, ఐక్యతను కాపాడి భిన్నత్వంలో ఏకత్వాన్ని నిలిపిన దేశ సమైక్యత శిల్పి మహనీయులు దేశ ప్రధమ ఉప ప్రధాని సర్దార్ వల్లబ్ భాయ్ పటేల్ చిరస్మరణీయులని జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి తెలిపారు. ఈనెల 31వ తేదీన కీ.శే. సర్దార్ వల్లబ్ భాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా మానవత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో గుంటూరులోని శ్రీమతి కాసు సాయమ్మ మున్సిపాల్ హై స్కూల్ ప్రాంగణంలో జాతీయ ఐక్యత దినోత్సవ సభ ఘనంగా జరిగింది. జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ప్రసంగిస్తూ స్వాతంత్రం అనంతరం 562 సంస్థానాలను విలీనం చేసి జాతీయ ఐక్యతను కాపాడిన ఘనత సర్దార్ వల్లబ్ భాయ్ పటేల్ కు దక్కుతుందన్నారు. 22 అధికార భాషలు, 20 వేల మాతృ భాషలు కలిగి 3 వేలకు పైగా కులాలు, 25 వేలకు పైగా ఉప కులాలు, విభిన్న మతాలు, సంస్కృతులు, ఆచారాలు, సాంప్రదాయాలతో కొనసాగుతున్న భారతదేశాన్ని సమైక్యంగా ఉంచడంలో భారతరత్న సర్దార్ వల్లబ్ భాయ్ పటేల్ కృషి ని భారతీయులు మరువలేరన్నారు. 2014 నుండి భారతదేశంలో జాతీయ ఐక్యత దినోత్సవాన్ని జరుపుకుంటున్నారని గుర్తు చేశారు. 600 అడుగుల ఎత్తుతో గుజరాత్ లోని నర్మద నది తీరాన సర్దార్ సరోవర్ డ్యాం ఎదురు సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని ఐక్యత ప్రతిమగా నిర్మించుకున్నామని ఇది దక్షిణ ఆసియాలో కెల్లా ఎత్తైన విగ్రహంగా వర్ణించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన తుమ్మూరి విజయ్ కృష్ణ ప్రసంగిస్తూ భారతీయులందరూ కుల, మత ప్రాంతాలకు అతీతంగా సమిష్టిగా కృషి చేస్తే సత్ఫలితాలు వస్తాయన్నారు. హిందూ మత గొప్పతనాన్ని వివరిస్తూ అన్ని సంస్కృతులను కలుపుకొని వెళ్లే శక్తి హిందూ మతానికి ఉందన్నారు. మానవత స్వచ్ఛంద సేవా సంస్థ ప్రెసిడెంట్ కోట శ్రీనివాసరావు ప్రసంగిస్తూ సర్దార్ వల్లబ్ భాయ్ పటేల్ స్వాతంత్ర్య ఉద్యమంలో చేసిన కృషిని వివరించారు. కేంద్ర హోం మంత్రిగా, దేశ ప్రథమ ఉప ప్రధానిగా సర్దార్ వల్లబ్ భాయ్ పటేల్ కృషి చేసి అఖండ భారతదేశాన్ని నిర్మించారన్నారు. ఇస్లాం మత విశిష్టతను అబ్దుల్ రషీద్, క్రైస్తవ మత ప్రాముఖ్యతను కోల జ్యోషి వివరించారు. మానవత నేత కొరిటపాటి పావని స్వాగత ఉపన్యాసం చేస్తూ నేటి విద్యార్థులు సర్దార్ వల్లబ్ భాయ్ పటేల్ త్యాగ నిరతిని, పోరాట పటిమని, దేశ సమగ్రత కోసం చేసిన కృషిని తెలుసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. శ్రీమతి కాసు సాయమ్మ మున్సిపాల్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు షేక్ జిలాని ప్రసంగిస్తూ 1948లో ఆపరేషన్ పోలో పేరుతో హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేయడంలో సర్దార్ వల్లబ్ భాయ్ పటేల్ కృషిని మరువ లేమన్నారు.
ఈ కార్యక్రమంలో మానవత నేతలు చావా శివాజీ, లక్ష్మీ సామ్రాజ్యం, యలమంచలి శివాజీ, ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థిని కొరిటపాటి సుస్మిత తదితరులు ప్రసంగించారు. దాదాపు 300 మంది విద్యార్థినీ, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. తొలుత సర్దార్ వల్లబ్ భాయ్ పటేల్ చిత్రపటానికి పూలతో నివాళులు అర్పించారు
