డిప్యూటీ స్పీకర్ను తప్పించాలని డిమాండ్
రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు దళితులపై అన్యాయాలు కొనసాగిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని బీఎస్సీ పార్టీ రాజమండ్రి జిల్లా అధ్యక్షుడు పట్నాల విజయ్ కుమార్ హెచ్చరించారు.
పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో జరిగిన ఘటనలో జైలుకు వెళ్లి బెయిల్పై విడుదలైన బాధితులను గురువారం ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా బీఎస్సీ నాయకులు ఇసకపట్ల రాంబాబు, మునీంద్ర, కొత్తపల్లి శేఖర్ తదితరులతో కలిసి బాధితులకు పూలమాలలు వేసి స్వాగతం పలికారు.
తరువాత సెంట్రల్ జైలు వద్ద మీడియాతో మాట్లాడిన విజయ్ కుమార్, గతంలో వైసీపీ ప్రభుత్వం గోపాలపురం నియోజకవర్గంలో దళితులపై తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపిందని విమర్శించారు. ఆ పరిణామాల ఫలితంగా ఎన్నికల్లో వైసీపీకి భారీ నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు.
ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఉన్నప్పటికీ దళితులపై దాడులు తగ్గలేదని, ఆకివీడుకు చెందిన 57 మంది దళితులపై దేశద్రోహం కేసులు నమోదు చేయడం దుర్మార్గమని అన్నారు. ఈ కేసుల్లో బెయిల్ రాకుండా అడ్డుకునేందుకు డిప్యూటీ స్పీకర్ ప్రభావం చూపారని ఆరోపించారు. అయితే న్యాయం దళితులవైపే ఉండటంతో కోర్టులు వారికి బెయిల్ మంజూరు చేశాయని తెలిపారు.
రఘురామకృష్ణంరాజును వెంటనే డిప్యూటీ స్పీకర్ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ, లేనిపక్షంలో రానున్న ఎన్నికల్లో దళితులు కూటమికి గట్టి సమాధానం ఇస్తారని హెచ్చరించారు.
