Home News ప్రైవేట్ బస్సులు తనిఖీలు

ప్రైవేట్ బస్సులు తనిఖీలు

0

5 స్లీపర్ కోచ్‌లు సీజ్
డీటీవో ఆర్ సురేష్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రాజమహేంద్రవరం నుంచి హైదరాబాద్, బెంగళూరు వంటి ప్రధాన నగరాలకు నడిచే ఆల్ ఇండియా టూరిస్ట్ పర్మిట్ ప్రైవేట్ బస్సులపై విస్తృత తనిఖీలు నిర్వహించారు.
తూర్పుగోదావరి జిల్లా రవాణా అధికారి ఆర్. సురేష్ ఆదేశాల మేరకు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు కలిసి ఏప్రిల్ 8, 9 తేదీల్లో ప్రత్యేక డ్రైవ్ చేపట్టగా, నిబంధనలు ఉల్లంఘించిన మొత్తం 5 స్లీపర్ కోచ్ బస్సులను సీజ్ చేశారు.
తనిఖీలలో ప్రయాణీకుల భద్రతను విస్మరించిన పలు తీవ్రమైన లోపాలు బయటపడ్డాయి. బస్సుల దిగువ భాగంలో అక్రమంగా అదనపు డీజిల్ ట్యాంకులు అమర్చడం, అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించాల్సిన ఎమర్జెన్సీ ఎగ్జిట్‌లను లగేజీతో మూసివేయడం, అలాగే నిబంధనలకు అనుగుణంగా వెనుక ఎమర్జెన్సీ డోర్ లేకపోవడం వంటి ఉల్లంఘనలు గుర్తించారు.
గురువారం జిల్లా రవాణా అధికారి స్వయంగా ఒక బస్సును తనిఖీ చేయగా, అందులో కూడా అదనపు డీజిల్ ట్యాంకు ఉన్నట్లు గుర్తించారు. ఇలాంటి చర్యలు ప్రయాణీకుల ప్రాణాలకు ముప్పు కలిగిస్తాయని ఆయన హెచ్చరించారు.
సీజ్ చేసిన 5 బస్సులను రాజమహేంద్రవరం ఆర్టీఏ కార్యాలయంలో భద్రపరిచారు. ఈ బస్సులకు సంబంధించి సుమారు రూ.2,15,000 పన్ను మరియు జరిమానా బస్సు యజమానులు చెల్లించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.
నిబంధనలు ఉల్లంఘించే ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని, తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని జిల్లా రవాణా అధికారి ఆర్. సురేష్ స్పష్టం చేశారు.
ఈ తనిఖీల్లో రవాణా అధికారులు సంపత్ కుమార్, ప్రణీత్, ఉమామహేశ్వర రావు, రాధిక, సుమ పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version