` వచ్చే ఆరు మాసాల్లో గ్రామ, వార్డుల సరిహద్దులు నిర్ఱయం
` స్వర్ణ గ్రామ, వార్డులలో 465 సేవలు అందించాలి
` జిల్లా ఇంచార్జి మంత్రి బాల వీరాంజనేయ స్వామి
గ్రామ, వార్డు కార్యదర్శుల అనధికార డెప్యుటేషన్లు రద్దు చేయాలని జిల్లా ఇంచార్జి మంత్రి డా.బాల వీరాంజనేయ స్వామి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డుల పని తీరుపై జోనల్ కమిషనర్లు, ఎంపీడీవోలు ,సంబంధిత జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ ఎం. ఎన్. హరేందిర ప్రసాద్, స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు డైరెక్టర్ శివప్రసాద్, ప్రభుత్వ విప్ గణబాబు, ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ అక్రమ డెప్యుటేషన్లు రద్దు చేయాల్సిందేనని స్పష్టం చేశారు. స్వర్ణ గ్రామ స్వర్ణ వార్డుల్లో ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడమే ధ్యేయంగా సంబంధిత అధికారులు పనిచేయాలన్నారు. గ్రామ స్వర్ణ వార్డులు వచ్చిన తరువాత మొదటి సమావేశం విశాఖపట్నంలో నిర్వహిస్తున్నామన్నారు. గ్రామ వార్డు కార్యదర్శుల ద్వారా 465 సేవలను ప్రజలకు అందిస్తున్నామన్నారు. స్వర్ణ గ్రామ వార్డుల్లో పని చేసేవారు ప్రజలకు సేవలు అందించడమే లక్ష్యంగా పని చేయాలన్నారు. రాబోయే ఆరు నెలల్లో స్వర్ణ గ్రామ వార్డులకు హద్దులు నిర్ణయిస్తామన్నారు. గ్రామ వార్డు కార్యదర్శల అనధికార డిప్యూటేషన్లు రద్దుచేసి తిరిగి వారినీ యధా స్థానాల్లో నియమించడానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఏకీకృత కుటుంబ సర్వే తప్పులు లేకుండా పూర్తి చేయాలని, తప్పులు జరిగితే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సర్వే వల్ల ప్రజలకు ఎలాంటి నష్టం ఉండదని, ప్రభుత్వ అధికారులు చేస్తున్న సర్వేకు ప్రజలు సహకరించాలని కోరారు. కుటుంబ సర్వే, వాట్సాప్ సేవలు, మనమిత్ర ఆధార్ తదితర వాటిపై ప్రజల్లో విస్తృత ప్రచారం చేసి అవగాహన కల్పించాలని కోరారు. ఎంపీడీవోలు జోనల్ అధికారులు, జిల్లా అధికారులు సమర్థవంతంగా పర్యవేక్షణ చేసి ప్రజలకు వీలైనంత మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేయాలని కోరారు. ఈ సమావేశంలో అధికారి ఉషారాణి, అడిషనల్ కమిషనర్ సత్యవేణి, జోనల్ అధికారులు, ఎంపీడీవోలు,పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు.
