భారత దేశ చరిత్రలో సామాజిక న్యాయం, ప్రజాసేవకు ప్రతీకగా నిలిచిన మహానేత బాబు జగజ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా రాజమండ్రి నగరంలోని స్థానిక 3వ మండలం, 14వ వార్డులో ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమాన్ని ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు తగరం సురేష్ బాబు అధ్యక్షతన, యెందం రాము ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ సోము వీర్రాజు, జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర హాజరయ్యారు. ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ, బాబు జగజ్జీవన్ రామ్ భారత రాజకీయాల్లో అత్యంత బలమైన నాయకుల్లో ఒకరని పేర్కొన్నారు. ఆయన ఉప ప్రధానిగా ఎదగడంలో అప్పటి జనసంఘ్ కీలక పాత్ర పోషించిందని తెలిపారు. అలాగే మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి, బాబు జగజ్జీవన్ రామ్ నాయకత్వం మరియు అనుభవానికి అధిక ప్రాధాన్యత ఇచ్చేవారని అన్నారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు అడబాల రామకృష్ణ, రాము, భవాని, చింతపల్లి సతీష్, కొల్లాపు శీను తదితరులు పాల్గొన్నారు.
