ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ పర్యటన నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లాలో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్ స్వయంగా పర్యవేక్షణ నిర్వహించారు.
ఈనెల 10న ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ లో జరగనున్న స్నాతకోత్సవ కార్యక్రమానికి గవర్నర్ హాజరవనున్న నేపథ్యంలో, రాజానగరం పరిసర ప్రాంతాల్లో విస్తృత భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. గోదావరి గ్లోబల్ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ ప్రాంతాన్ని, అలాగే నన్నయ యూనివర్సిటీ సభా మండపాన్ని ఎస్పీ పరిశీలించారు.
అదేవిధంగా యూనివర్సిటీ లైబ్రరీని సందర్శించిన ఎస్పీ, అక్కడి పుస్తకాలను పరిశీలిస్తూ విద్యార్థులతో కొంతసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా భద్రతా సిబ్బందికి అవసరమైన సూచనలు, మార్గదర్శకాలు జారీ చేశారు.గవర్నర్ పర్యటన విజయవంతంగా, ఎలాంటి అంతరాయాలు లేకుండా నిర్వహించేందుకు అధికారులు ముందస్తు చర్యలు తీసుకున్నారు.
ఈ తనిఖీలలో అడిషనల్ ఎస్పీ (ఏ.ఆర్.) ఎల్. చెంచి రెడ్డి, డీఎస్పీలు, ఇన్స్పెక్టర్లు మరియు ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.
