గొల్లల ఎండాడ ప్రాధమిక పాఠశాలను భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. తరగతి గదుల్లో చిన్నారులతో మాట్లాడారు. విద్యార్థుల ఆటపాటలను మురిపెంగా చూశారు. వాటిని ప్రదర్శించిన పిల్లలను అభినందించారు. మధ్యాహ్న భోజనాన్ని చిన్నారులకు ఆయన స్వయంగా వడ్డించడమే కాకుండా తరగతి గదిలో వారితో పాటు కలిసి భోజనం చేశారు. సౌకర్యాలు, బోధన విధానం, మధ్యాహ్న భోజన నాణ్యత గురించి అడిగి తీసుకున్నారు. పాఠశాలలోకి వెళ్లడానికి ప్రధాన గేటు వద్ద నిర్మాణంలో ఉన్న కల్వర్టు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. పాఠశాల ప్రాంగణంలో ఉన్న బోరు పనిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. చిన్నారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని పాఠశాల సిబ్బందికి సూచించారు. అడ్మిషన్ల విషయంలో ఎండాడ పాఠశాలతో నెలకొన్న సమస్య పరిష్కారానికి జిల్లా విద్యాశాఖాధికారితో మాట్లాడతానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జోనల్ కమిషనర్ అయ్యప్ప నాయుడు, కూటమి నాయకులు చిక్కాల విజయ్ బాబు, చెట్టుపల్లి సన్యాసిరావు, లొడగల అప్పారావు, సారిపల్లి శ్రీనివాస్, చెట్టుపల్లి గోపీ, మాధు వంశీ తదితరులు పాల్గొన్నారు.
