రాజమండ్రి సిటీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్ ఆధ్వర్యంలో నగర పార్టీ కార్యాలయంలో కార్యకర్తల విస్తృత సమావేశం ఘనంగా జరిగింది. ఈ సమావేశానికి పార్టీ జిల్లా అబ్జర్వర్, మాజీ ఎమ్మెల్యే గురునాధ రెడ్డి, జిల్లా 
అధ్యక్షుడు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, రాష్ట్ర అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్, పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్, రాకుండా మాజీ చైర్ పర్సన్ మేకపాటి షర్మిలా రెడ్డి, తదితర నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా భరత్ మాట్లాడుతూ కార్యకర్తలే పార్టీకి కీలకమని, వారి కోసం నిరంతరం అందుబాటులో ఉంటానన్నారు. నగర పార్టీ బలోపేతం, ‘సేవ్ రాజమండ్రి’ కార్యక్రమం ఉధృతం, రాబోయే కార్పొరేషన్ ఎన్నికలకు సన్నద్ధతపై దృష్టి సారిస్తామన్నారు. పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకు రూ.5 లక్షల ప్రమాద బీమాను తాను స్వయంగా చెల్లిస్తానని ప్రకటించి తొలి విడతగా పది మందికి బీమా పత్రాలు అందజేశారు. జిల్లా అధ్యక్షుడు వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ సంస్థాగత బలం పెంచుకోవాలని, జగన్ నాయకత్వమే పార్టీకి బలమని పేర్కొన్నారు. సమావేశంలో పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.