పాడేరు,జయ జయహే అవ్వాతాతల ఆనందం- ఎన్టిఆర్ భరోసా పెన్షన్ తో సాకారమవుతోందని జిల్లా కలెక్టర్ ఏ ఎస్ దినేష్ కుమార్ అన్నారు. శనివారం జి మాడుగుల మండలం పరదేశిపుట్టు గ్రామం, కే కోడపల్లి గ్రామ సచివాలయం లో ఎన్టీఆర్ భరోసా పెన్సన్ల కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం ద్వారా వేలాది మంది పేద, బలహీన వర్గాల ప్రజలు లబ్ధిపొందుతున్నారని చెప్పారు. ఈ పథకం వృద్ధులు,ఒంటరి మహిళలు,దివ్యాంగులు, కిడ్నీ బాధితులు వంటి వర్గాలకు ఆర్థిక భరోసా అందజేస్తోందని కలెక్టర్ పేర్కొన్నారు.
పెన్షన్ తీసుకునే ప్రతీ ఒక్కరికీ సమయానికి పెన్షన్లు అందేలా గ్రామ,వార్డు సచివాలయాల ద్వారా పంపిణీ చేయడం జరుగుతోందని తెలిపారు. ప్రభుత్వం పేదల సంక్షేమం పట్ల అంకితభావంతో ఉన్నదని, ఎవ్వరూ వెనుకబడి ఉండకూడదనే సంకల్పంతో ఈ పథకాన్ని బలోపేతం చేస్తోందని ఆయన అన్నారు. అర్హత కలిగి, పెన్షన్ రాని లబ్ధిదారులు సచివాలయాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
అనంతరం కలెక్టర్ లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి వారి కష్టసుఖాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం మంజూరు చేసిన పెన్షన్ మొత్తాన్ని వారికి అందచేసారు. జిల్లాలో 92.46 శాతం పెన్షన్ పంపిణీ జరిగిందని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లాగ్రామీణఅభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ వి మురళి, జి మాడుగుల తహసిల్దార్ జి రాజ్ కుమార్, ఎంపీడీవో డేవిడ్ రాజు, సర్పంచ్ మాతే చిలకమ్మా, ఎక్స్ ఎంపీటీసీ సోమేలి జానకమ్మ తదితరులు పాల్గొన్నారు.
