ఆవిర్భావ సమావేశంలో గంటా
తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించిన స్వర్గీయ ఎన్టీఆర్ సంక్షేమ పథకాలకు ఆద్యుడని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. తెలుగుదేశం ఆవిర్భావం సందర్భంగా ఆదివారం భీమిలి పార్టీ కార్యాలయం వద్ద పార్టీ జెండాను ఎగుర వేసిన అనంతరం కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రూ. 2 కిలో బియ్యం, పక్కా ఇళ్లు, పెన్షన్ వంటి పథకాలను 44 ఏళ్ల కిందటే పేద ప్రజలకు అందించిన ఎన్టీఆర్ ను కారణజన్ముడిగా అభివర్ణించారు. సీఎంగా పని చేసిన టి.అంజయ్యను రాజీవ్ గాంధీ అవమానించిన తీరుకు ఎన్టీఆర్ ఆవేదన చెందారన్నారు. రాముడు, కృష్ణుడు, వేంకటేశ్వర స్వామి తదితర పాత్రలతో ప్రేక్షకులకు దగ్గరైన ఎన్టీఆర్ ను తెలుగు ప్రజలు దేవుడిగానే చూస్తారని తెలిపారు. సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్లు.. అనే నినాదంతో పార్టీ పెట్టిన 9 నెలల్లో వందేళ్ల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీని మట్టి కరిపించారన్నారు. పేద ప్రజలకు కూడు.. గూడు.. గుడ్డ.. అందించడమే తెలుగుదేశం సిద్ధాంతమని తెలియజేసి.. ప్రజల్లోకి వెళ్లి వారి ప్రేమాభిమానాలను చూరగొన్నారని వివరించారు. సీనియర్ నాయకులను సన్మానించుకోవాలని.. సైకిళ్లపై ర్యాలీ చేయాలని.. పార్టీ ఆవిర్భావ వేడుకలను వినూత్నంగా నిర్వహించిన గంటా రవితేజను అభినందించారు. ఆవిర్భావం నుంచి పార్టీ జెండా మోస్తున్న సీనియర్ కార్యకర్తలను శాలువా కప్పి సన్మానించారు. మెమెంటో బహుకరించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు గంటా రవితేజ, చిక్కాల విజయ్ బాబు, గంటా నూకరాజు, గాడు వెంకటప్పడు, తాట్రాజు అప్పారావు, కోరాడ రమణ, సరగడ అప్పారావు, గాడు చిన్ని కుమారి లక్ష్మి, బి.ఆర్.బి. నాయుడు, మొల్లి లక్ష్మణరావు, పీవీ నరసింహం, పిల్లా వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.
