పోతురాజు బాబు ఆలయ నిర్మాణానికి చర్యలు ఎమ్మెల్యే బండారు
మాడుగుల సాగరం రహదారిలో గల పొలాల్లో వెలసిన శ్రీ పోతురాజు బాబు స్వామి ఆలయ నిర్మాణానికి తగు చర్యలు తీసుకుంటున్నట్లు స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి చెప్పారు. మహాశివరాత్రి సందర్భంగా ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు ఆదివారం పోతురాజు బాబును దర్శించుకున్న ఆయన అనంతరం అక్కడ జరిగిన సభలో మాట్లాడుతూ టిటిడి భాగస్వామ్యంతో సుమారు 30 లక్షల వ్యయంతో ఈ స్వామి ఆలయ నిర్మాణానికి ప్రతిపాదిస్తున్నట్టు చెప్పారు. ఇందుకు కావాల్సిన స్థలాన్ని సిద్ధం చేయాలని సూచించారు. అలాగే ఆలయానికి వెళ్ళేందుకు చక్కని రహదారి కూడా నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. అలాగే తారకరామా జలాశయం నుంచి మాడుగుల రైతులకు సాగునీరు అందించే విధంగా కాలువ నిర్మాణానికి కృషి చేస్తానని ఇప్పటికే ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టిలో పెట్టడం జరిగిందని చెప్పారు. అలాగే మాడుగుల సమస్యలను ఎప్పటికప్పుడు పట్టణ పార్టీ అధ్యక్షుడు పుప్పాల లక్ష్మీనారాయణ తమ దృష్టికి తెస్తున్నారని వాటి అన్నింటిని పరిశీలిస్తామని చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పి అప్పలరాజు, పట్టణ పార్టీ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ తదితరులు కూడా మాట్లాడి ఆలయ నిర్మాణానికి , తారకరామం జలాశయ కాలువకు తగు సహకారం అందించాలని రైతుల తరఫున కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను మిగిలిన అతిధులను ఆలయ కమిటీ ప్రతినిధులు ఘనంగా సత్కరించారు. అలాగే పట్టణ పార్టీ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ పుట్టినరోజు వేడుకలను కూడా ప్రజల మధ్యలో నిర్వహించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో సహకార సంఘ అధ్యక్షుడు కే త్రినాధరావు, బిజెపి నాయకుడు ఎం వాసు, కూటమి నాయకులు పాల్గొన్నారు.
