బాధితులను పరామర్శించిన దగ్గుబాటి పురంధేశ్వరి
రాజమహేంద్రవరం , జయజయహే ప్రతినిధి:రాజమండ్రిలో చోటుచేసుకున్న పాలు కల్తీ ఘటనలో నలుగురు మృతి చెందడం అత్యంత విషాదకరమని రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి పేర్కొన్నారు. మంగళవారం ఆమె ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, కూటమి నాయకులతో కలిసి కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు.
బాధితుల ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్న అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె, ఈ ఘటనపై ప్రభుత్వం సీరియస్గా స్పందించిందన్నారు. పాలను శీతలీకరణ కోసం ఉపయోగించిన డీ-ఫ్రిజ్లోని రసాయనాలు లీక్ అయి పాలలో కలిసినట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించినట్లు తెలిపారు. పూర్తి స్థాయి దర్యాప్తు అనంతరం అసలు కారణాలు వెలుగులోకి వస్తాయని పేర్కొన్నారు.
మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా ప్రకటించినట్లు తెలిపారు. అలాగే చికిత్స పొందుతున్న బాధితులకు ప్రభుత్వం తరఫున మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఈ ఘటనపై ప్రజల్లో ఆందోళన నెలకొనగా, ప్రభుత్వం బాధిత కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉంటుందని ఎంపీ హామీ ఇచ్చారు.
