ప్రధాన ధ్యేయం
ఏపీ ఎన్జీఓస్ నగర అధ్యక్షులు వై.నారాయణరావు
విశాఖ సిటీ ఏపీ ఎన్జీవోస్ కార్యవర్గ సభ్యుల కీలక సమావేశం నగరంలో ఎన్జీఓస్ కార్యాలయం లో మంగళవారం జరిగింది. సిటీ అధ్యక్షులు నారాయణరావు, అసోసియేట్ ప్రెసిడెంట్ నగేష్ పట్నాయక్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సెక్రటేరియట్ మీటింగ్లో సంఘం బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించారు. సమావేశ వివరాలను సంఘం కార్యదర్శి గుర్రం చందర్రావు వెల్లడిస్తూ, ఎన్నికల అనంతరం కార్యవర్గ సభ్యులంతా కలిసి సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని గుర్తుచేశారు. సంఘం బలోపేతానికి సభ్యుల మధ్య ఐక్యత, పరస్పర అవగాహన ముఖ్యమని, ప్రతి ఒక్కరూ సంఘం కార్యాలయ వ్యవహారాల్లో చురుగ్గా పాల్గొనాలని పిలుపునిచ్చారు.
ముఖ్యంగా ఏపీ ఎన్జీవోస్ సభ్యత్వ నమోదు మరియు ఏపీ ఎన్జీవోస్ సమాచార పత్రిక చందా ప్రక్రియను వేగవంతం చేయాలని సభ్యులను కోరారు.అసోసియేషన్ వ్యవస్థాపకులు ఎంతో కష్టపడి నిర్మించిన ఈ సంఘాన్ని మరింత ఉన్నత స్థానానికి తీసుకెళ్లడానికి ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచేయాలన్నారు. సభ్యులందరూ వారానికి కనీసం రెండు సార్లు సంఘం కార్యాలయానికి వచ్చి సహచరులతో చర్చించాలని, దీనివల్ల పని చేసే ఉత్సాహం మరింత పెరుగుతుందని సూచించారు. అలాగే సంఘ శ్రేయస్సు దృష్ట్యా గ్రూపుల్లో పెట్టే ముఖ్యమైన సమాచారానికి సభ్యులు వెంటనే స్పందించాలని, ఐకమత్యంతో ముందుకు సాగాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో డీఈసీ సభ్యులు మరియు ఇతర కార్యవర్గ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
