Monday, June 1, 2026
HomePoliticsAndhra Pradeshనేషనల్ ట్రావెల్ మార్ట్

నేషనల్ ట్రావెల్ మార్ట్

– ఏపీ పర్యాటక రంగంలో కొత్త అధ్యయనానికి నాంది
– పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్
– టూర్ ఆపరేటర్లే పర్యాటక రంగానికి బ్రాండ్ అంబాసిడర్లు

– గడిచిన 18 నెలల్లో రూ.20,088 కోట్ల పెట్టుబడులు
– 1.22 లక్షల ఉద్యోగాల సృష్టి

– ‘స్వర్ణాంధ్ర విజన్ 2047’ దిశగా పర్యాటక పరుగులు

విశాఖపట్నం, ఫిబ్రవరి 13, జయ జయ హే : నేషనల్ ట్రావెల్ మార్ట్’ కేవలం ఒక సమావేశం కాదు.. ఇది ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగంలో ఒక సరికొత్త అధ్యయనానికి నాంది అని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ అభివర్ణించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అసోసియేషన్ ఆఫ్ డొమెస్టిక్ టూర్ ఆపరేటర్స్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా ఫిబ్రవరి 13, 14 తేదీల్లో విశాఖలో నిర్వహిస్తున్న ఈ మెగా టూరిజం మార్ట్‌లో మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్ యొక్క తీరప్రాంతం, గిరిజన ప్రాంతాలు, వారసత్వ ప్రదేశాలు మరియు ఎకో-అడ్వెంచర్ టూరిజంను ప్రదర్శించడం, దేశీయ పర్యాటకాన్ని పెంచడమే లక్ష్యంతో టూర్ ఆపరేటర్లు, హోటల్ గ్రూప్ లు, ట్రావెల్ నిపుణులతో నిర్వహించిన సమావేశంలో పర్యాటక రంగం అభివృద్ధిలో టూర్ ఆపరేటర్ల ప్రాముఖ్యతను వివరిస్తూ టూర్ ఆపరేటర్లే మా బ్రాండ్ అంబాసిడర్లు అన్న మంత్రి దుర్గేష్ వ్యాఖ్యలతో హర్షధ్వానాలు వెల్లువెత్తాయి.
ఇంకా ఆయనేమన్నారంటే…. ఆంధ్రప్రదేశ్ కేవలం ఆధ్యాత్మిక వారసత్వానికే కాకుండా, పరివర్తన మరియు ఆవిష్కరణలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోందని అన్నారు. జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య పుట్టిన ఈ నేల పట్ల రాష్ట్రం గర్వపడుతోందని తెలిపారు. ఛత్తీస్‌గఢ్ సంస్కృతిని, రామాయణ కాలం నాటి దండకారణ్య విశేషాలను ప్రస్తావిస్తూ, పొరుగు రాష్ట్రాలతో సమన్వయానికి ప్రాధాన్యతనిచ్చారు. కేంద్రం సహకారంతో సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో పర్యాటక రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి దుర్గేష్ తెలిపారు. నూతన పర్యాటక పాలసీ 2024-29,పర్యాటక రంగానికి పరిశ్రమ హోదా, సబ్సిడీలు, ఎస్జీఎస్టీ రీయింబర్స్‌మెంట్, స్టాంపు డ్యూటీ మినహాయింపులతో ఇన్వెస్టర్లకు పెద్దపీట వేస్తున్నామన్నారు. కేవలం 18 నెలల్లో రూ.20,088 కోట్ల విలువైన 117 ప్రాజెక్టులకు ఒప్పందాలు జరిగాయని, దీని ద్వారా 1,22,637 ఉద్యోగాల సృష్టికి మార్గం సుగమమైందని వెల్లడించారు. తద్వారా హోటల్స్, రిసార్ట్స్, థీమాటిక్ పార్క్ లు తదితరాలు పెద్దఎత్తున ఏర్పాటు చేయడానికి పెట్టుబడిదారులు ముందుకు వచ్చారన్నారు. కేవలం ‘ఈజ్ ఆఫ్ డూయింగ్’ మాత్రమే కాకుండా, ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్’ ద్వారా సింగిల్ విండో విధానంలో అనుమతులు జారీ చేస్తున్నామని స్పష్టం చేశారు. సరళీకృత విధానాలు, సింగిల్ విండో క్లియరెన్స్, ఇన్వెస్టర్ ఫెసిలిటేషన్ సెల్స్, రియల్-టైమ్ ట్రాకింగ్, పారదర్శకమైన భూ కేటాయింపులు నిర్ణీత కాలపరిమితిలో అనుమతులు మంజూరు చేస్తున్నామన్నారు.
ఏపీ పర్యాటక రంగ విశేషాలను పర్యాటక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్, ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలికాట వివరించారు. 3పి మోడల్ పాలసీ, పార్ట్ నర్ షిప్, ప్రాసెస్ అద్భుతమైన ఫలితాలను ఇస్తోందని వారు తెలిపారు.ఏపీ పర్యాటక కొత్త పాలసీ 2024-29 ద్వారా కొత్త ఒరవడికి నాంది పలికామన్నారు. కార్యక్రమంలో ఛత్తీస్ గడ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ నీలూశర్మ, ఏపీటీడీసీ ఛైర్మన్ నూకసాని బాలాజీ, పర్యాటక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్, ఏపీటీడీసీ ఎండీ, ఏపీటీఏ సీఈవో ఆమ్రపాలి కాట, ఛత్తీస్ గడ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఎండీ వివేక్ ఆచార్య, ఏపీటీడీసీ ఈడీ పద్మావతి, ఏపీటీఏ డిప్యూటీ సీఈవో శ్రీనివాస్, ఏడీటీవోఐ ప్రెసిడెంట్ వేద్ ఖన్నా, విజయ్ మోహన్ , స్వామినాయుడు, మహాపాత్ర, టూర్ ఆపరేటర్లు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments