ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ వ్యవహారంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాదులో జరిగిన రేవ్ పార్టీలో ఎంపీ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నైతిక బాధ్యత వహించి ఆయనతో వెంటనే రాజీనామా చేయించాలని మాజీ ఎంపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరత్ రామ్ ఘాటుగా డిమాండ్ చేశారు.
ఆదివారం స్థానిక వీఎల్పురంలోని మార్గాని ఎస్టేట్స్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజా ప్రతినిధిగా ఉండి రేవ్ పార్టీ వంటి ఘటనలో పట్టుబడటం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సిగ్గుచేటని మండిపడ్డారు. చట్టసభల్లో కూర్చుని చట్టాలు చేయాల్సిన వారు డ్రగ్స్, కొకైన్ వంటి అనైతిక చర్యలకు పాల్పడి అరెస్టు కావడం రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టకు మాయని మచ్చగా నిలిచిందన్నారు.
తెలుగుదేశం పార్టీ ఇటువంటి వ్యక్తులను ప్రజా ప్రతినిధులుగా నిలబెట్టడం ఆ పార్టీ సిద్ధాంతాలు, నీతి, నిబద్ధతపై ప్రశ్నలు తలెత్తిస్తున్నదని భరత్ విమర్శించారు. ఈగల్ టీం నిర్వహించిన పరీక్షల్లో మహేష్ కుమార్ యాదవ్ డ్రగ్స్ తీసుకున్నట్లు వెల్లడైందని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో ఈగల్ టీం, ఇతర పోలీసు ఉన్నతాధికారులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఉమ్మడి రాష్ట్రాల్లో కలకలం రేపిన ఈ ఘటనపై కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు కనీసం స్పందించకపోవడం మరింత ఆందోళన కలిగిస్తోందని భరత్ వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారం వల్ల ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న విశ్వాసం దెబ్బతింటోందని అన్నారు.
అందుకే వెంటనే సీఎం చంద్రబాబు నాయుడు ఎంపీ మహేష్ కుమార్ యాదవ్ను తెలుగుదేశం పార్టీ నుంచి తొలగించడమే కాకుండా ఎంపీ పదవికి రాజీనామా చేయించాలని మార్గాని భరత్ రామ్ తీవ్రంగా డిమాండ్ చేశారు.
ఎంపీ పుట్టా మహేష్ కుమార్ రాజీనామా చేయించాలి – మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ డిమాండ్
RELATED ARTICLES
