ఇంటింటికీ వెళ్లి పింఛన్ల పంపిణీ చేసి అవ్వాతాతల బాగోగులు తెలుసుకున్న జిల్లా కలెక్టర్*
*పింఛనుదారులతో మమేకమై సమస్యలను తెలుసుకున్న కలెక్టర్ అమ్మా!… బాగున్నారా…ఇదిగో మీ పింఛన్!… అంటూ ఇంటింటికీ వెళ్లి పింఛన్లను పంపిణీ చేసి అవ్వా, తాతల బాగోగులను జిల్లా కలెక్టర్ ఎ.ఎస్. దినేష్ కుమార్ అడిగి తెలుసుకున్నారు. పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, అందుకే ప్రతీనెలా ఇంటింటికీ వెళ్లి పేద ప్రజలకు సామాజిక పింఛన్లను పంపిణీ చేస్తున్నామని అన్నారు.
పేదల సేవలో భాగంగా సామాజిక పింఛన్ల కార్యక్రమం అరకు మండలం మడగడ గ్రామపంచాయతీ, బెంజిపూర్ గ్రామంలో శనివారం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొని అవ్వా, తాతలకు, వితంతువులకు, దివ్యాంగుల ఇంటింటికీ వెళ్లి స్వయంగా పింఛన్లను పంపిణీ చేసి, వారితో మమేకమై బాగోగులు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ వివిధ రకాల పింఛన్ల కింద జిల్లావ్యాప్తంగా 74,295 మందికి రూ.31.38 కోట్ల నగదును పింఛనుదారులకు ప్రతీ నెలా ఒకటవ తేదీన ఠంచనుగా అందజేస్తున్నట్లు చెప్పారు. సాధ్యమైనంత వరకు శత శాతం పింఛన్లు పంపిణీ అయ్యేలా అధికారులను ఆదేశించినట్లు చెప్పారు.
ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ, ఉద్యానశాఖ అధికారి, పంచాయతీ సెక్రెటరీ, ఎఎంసి చైర్మన్ శ్రీమతి లక్షీ, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
