లోకేష్.. జోష్..!
సీఐఐ సదస్సులో వరుస ఎంఎయూలు
కలిసి పనిచేద్దామంటూ సంస్థలకు పిలుపు
రూ. 1.10 వేల కోట్లతో బ్రూక్ ఫీల్డ్ పెట్టుబడులపై ఉద్వేగం
(విశాఖపట్నం – జయజయహే)
ఆస్ట్రేలియా కాన్సులేట్ జనరల్ జిలాయ్ సాకి, జేమ్స్ కుక్ యూనివర్సిటీ ప్రతినిధులతో సీఐఐ పార్టనర్ షిప్ సమ్మిట్లో మంత్రి నారా లోకేశ్ భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ యువత కోసం పర్యావరణ, ఆరోగ్య సంరక్షణ, సస్టైనబుల్ టూరిజం రంగాల్లో స్కిల్ డెవలప్మెంట్ శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని మంత్రి కోరారు. ఫిషింగ్, ఆక్వాకల్చర్, తీరప్రాంత పర్యావరణ వ్యవస్థ నిర్వహణపై మారిటైమ్, తీర ప్రాంత పరిశోధనలకు ఏపీ వర్సిటీలతో కలసి పని చేయాలని విజ్ఞప్తి చేశారు. గ్రామీణ ఆంధ్రప్రదేశ్లో ట్రోపికల్ వ్యాధులు, ఆరోగ్య సంరక్షణ, పాండమిక్ ప్రిపేర్డ్నెస్పై ఏపీ వర్సిటీలతో కలసి ఉమ్మడి పరిశోధనలు చేపట్టాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఎనర్జీ లక్ష్యాలకు అనుగుణంగా టెక్నాలజీ, పాలసీ రిసెర్చ్కి సహకారం అందించాలని సూచించారు. వ్యవసాయ, పట్టణ నీటి అవసరాలకు జలవనరుల నిర్వహణలో నైపుణ్యం కోసం ఏపీతో కలసి ట్రోఫికల్ వాటర్ రిసెర్చ్ గ్రూప్ ఏర్పాటు చేయాలని మంత్రి లోకేశ్ విజ్ఞప్తి చేశారు. అనంతరం యాక్షన్ టెసా ఎండీ అండ్ సీఈవో వివేక్ జైన్తో మంత్రి నారా లోకేశ్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో సెకండరీ శాటిలైట్, ఎండీఎఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పాటు చేయాలని మంత్రి కోరారు. ప్రస్తుతం సితార్ గంజ్ తయారీ కేంద్రం 7.5 లక్షల సీబీఎం సామర్థ్యంతో పని చేస్తున్నందున, ఏపీలో సెకండరీ యూనిట్ ఏర్పాటు చేస్తే అదనపు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లకు డిమాండ్ మద్దతు నిస్తుందని చెప్పారు. దిల్లీ ప్రధాన కేంద్రంగా పని చేస్తున్న తమ సంస్థలో ప్రస్తుతం 2,846 మంది ఉద్యోగులు పని చేస్తున్నారని సీఈవో వివేక్ జైన్ తెలిపారు. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తామని తెలిపారు.
అమెరికాకు చెందిన బ్రూక్ఫీల్డ్ అసెట్ మేనేజ్మెంట్ ఏపీలో రూ.లక్షా 10 వేల కోట్ల పెట్టుబడి పెడుతోందని మంత్రి లోకేశ్ వెల్లడించారు. 17 నెలల్లో ఏపీకి ఇదో మరో భారీ పెట్టుబడని ‘ఎక్స్’లో ట్వీట్ చేశారు. పునరుత్పాదక విద్యుత్, బ్యాటరీ, పంప్డ్ స్టోరేజ్ రంగాల్లో బ్రూక్ఫీల్డ్ పెట్టుబడులు పెట్టనుందని వెల్లడించారు. సోలార్ ప్యానెల్ తయారీతో పాటు డేటా సెంటర్లు, కమర్షియల్ రియల్ ఎస్టేట్, జీసీసీలు, ఇన్ఫ్రా, పోర్టుల రంగాల్లోనూ ఈ పెట్టుబడులు రానున్నాయని అన్నారు. ఈ భారీ పెట్టుబడి వల్ల ఆంధ్రప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ హబ్గా మరింత బలపడనుందని తెలిపారు. వేలాది ఉద్యోగావకాశాలు, కొత్త పరిశ్రమల ఏర్పాటుతో దీర్ఘకాలిక ఆర్థిక వృద్ధి చేకూరుతుందని తెలియజేశారు. ఇది ఆంధ్రప్రదేశ్కు గేమ్ ఛేంజర్ కానుందని సస్టైనబుల్ ట్రాన్స్ఫార్మేటివ్ ఇన్వెస్ట్మెంట్స్కు ఏపీ ప్రధాన గమ్యం అవుతోందని మంత్రి లోకేశ్ అన్నారు.
