సంకష్టహర చతుర్థి పర్వదినాన్ని పురస్కరించుకుని గోకవరంలోని తంటికొండ రోడ్డులో గల సీఎండీ కార్యాలయం వద్ద లక్ష్మీ గణపతి హోమం ఘనంగా నిర్వహించారు. విశ్వహిందూ ధర్మపరిరక్షణ రామసేన అధ్యక్షుడు, బీజేపీ నాయకుడు కంబాల శ్రీనివాసరావు తన సతీమణి పద్మావతి దేవి గంగారత్నంతో కలిసి శాస్త్రోక్తంగా హోమ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమాన్ని అర్చకులు డాక్టర్ వల్లూరి జగన్నాధరావు శర్మ వేద మంత్రోచ్ఛారణల మధ్య నిర్వహించారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని సంకల్పంతో ఈ హోమాన్ని నిర్వహించినట్లు కంబాల శ్రీనివాసరావు తెలిపారు.
అలాగే పాడి పంటలు సమృద్ధిగా పండాలని, అన్నదాతలు, వ్యాపారవేత్తలు, కార్మికులు సహా అన్ని రంగాల వారు అభివృద్ధి సాధించాలనే ఉద్దేశంతో ప్రతి నెలా ఈ హోమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో రామసేన సభ్యులు, బీజేపీ నాయకులు, సిబ్బంది మరియు స్థానిక భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
