భారతదేశ రవాణా రంగంలో విమానయానం ఒక విప్లవాత్మకమైన మార్పును తీసుకువచ్చింది. దేశాభివృద్ధిలో, ముఖ్యంగా సుదూర ప్రాంతాలను అతి తక్కువ సమయంలో అనుసంధానించడంలో ఆకాశయాన వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తోంది. నేడు మనం చూస్తున్న అత్యాధునిక సౌకర్యాలతో కూడిన విమానశ్రయాలకు పునాది రాయి ఎక్కడ పడిందో తెలుసుకోవడం ఎంతో ఆసక్తికరం. భారతదేశపు మొట్టమొదటి దేశీయ విమానశ్రయంగా గుర్తింపు పొందిన ‘జుహూ విమానశ్రయం’ (జుహూ ఏరోడ్రోమ్), మన దేశ వైమానిక చరిత్రలో ఒక మరుపురాని అధ్యాయం.
చారిత్రక నేపథ్యం మరియు ఆరంభం
మహారాష్ట్ర రాజధాని అయిన ముంబయి నగరంలోని తీర ప్రాంతమైన జుహూలో 1928వ సంవత్సరంలో ఈ విమానశ్రయం స్థాపించబడింది. ఆ కాలంలో ఇది విమానాల రాకపోకలకు, అంటే దిగుట మరియు ఎగురుట (టకె-ఒఫ్ఫ్ అంద్ ళందింగ్) కోసం ప్రత్యేకంగా కేటాయించిన ప్రధాన కేంద్రంగా విరాజిల్లింది. అప్పట్లో ఆకాశ ప్రయాణం అనేది భారతీయులకు ఒక సరికొత్త మరియు వింతైన అనుభవం. కేవలం ధనికులకు, పాలకులకు మాత్రమే పరిమితమైన ఈ రవాణా వ్యవస్థకు జుహూ విమానశ్రయం ఒక వేదికగా నిలిచింది.
భారత విమానయాన రంగ పితామహుడిగా పిలువబడే జహంగీర్ రతన్ జీ దాదాభాయ్ టాటా (జె.ఆర్.డి. టాటా) ఈ రంగ అభివృద్ధికి అపరిమితమైన కృషి చేశారు. 1932వ సంవత్సరంలో ఆయన స్వయంగా విమానాన్ని నడుపుతూ, కరాచీ నుండి అహ్మదాబాద్ మీదుగా ముంబయిలోని జుహూ విమానశ్రయానికి చేరుకున్నారు. ఇది దేశంలోనే మొట్టమొదటి తపాలా విమాన సేవగా (ఆఇర్ ంఐల్ శెర్విచె) చరిత్ర సృష్టించింది. ఈ సంఘటన భారత వైమానిక రంగానికి ప్రాణవాయువును అందించడమే కాకుండా, భవిష్యత్తులో ఏర్పడబోయే భారీ విమానయాన సంస్థలకు గట్టి పునాది వేసింది.
సేవలు మరియు సాంకేతికత
ప్రారంభ దశలో జుహూ విమానశ్రయం కేవలం ప్రయాణికుల కోసమే కాకుండా, అత్యవసర తపాలా పంపిణీకి మరియు పరిపాలనాపరమైన అవసరాలకు ప్రధాన కేంద్రంగా ఉండేది. అప్పటి సాంకేతిక పరిజ్ఞానంతో పోలిస్తే, ఇది ఒక గొప్ప ఆవిష్కరణగా పరిగణించబడింది. గుర్రపు బండ్లు, ఎద్దుల బండ్లు మరియు నెమ్మదిగా సాగే రైలు ప్రయాణాల మధ్య, గాలిలో ప్రయాణించడం అనేది దేశ పురోగతికి ఒక సంకేతంగా నిలిచింది. దీనివల్ల వ్యాపార లావాదేవీలు, సమాచార మార్పిడి మరియు ప్రభుత్వ కార్యకలాపాలు అత్యంత వేగంగా సాగడానికి వీలు పడింది.
కాలక్రమేణా విమానాల సంఖ్య పెరగడం, సాంకేతికత విస్తరించడంతో ముంబయిలోనే మరింత విశాలమైన మరియు ఆధునిక సదుపాయాలు కలిగిన అంతర్జాతీయ విమానశ్రయాలు (సహార్ వంటివి) వెలిశాయి. దీనితో జుహూ విమానశ్రయం యొక్క ప్రాముఖ్యత కొంతమేర తగ్గినప్పటికీ, దీని చారిత్రక విలువ మాత్రం చెక్కుచెదరలేదు. నేటికీ ఈ ప్రాంతం హెలికాప్టర్ల రాకపోకలకు మరియు చిన్నపాటి విమానయాన శిక్షణల కోసం ఉపయోగించబడుతోంది.
1928లో ఒక చిన్న అడుగుగా ప్రారంభమైన జుహూ విమానశ్రయం, నేడు భారతదేశం ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద విమానయాన మార్కెట్గా ఎదగడానికి మూలకారణమైంది. వందలాది విమానశ్రయాలు, వేలాది విమానాలతో దేశం నలుమూలలకూ విస్తరించిన నేటి వ్యవస్థకు ఈ కేంద్రమే ఆది గురువు. భారతదేశ రవాణా చరిత్రలో ఆకాశ మార్గాన ప్రగతి బావుటా ఎగురవేసిన జుహూ విమానశ్రయం, రాబోయే తరాలకు ఒక స్ఫూర్తిదాయకమైన స్మారక చిహ్నంగా నిలిచిపోతుంది.
(సి.హెచ్.ప్రతాప్)
