భారతదేశంలో ధూమశకట (రైల్వే) వ్యవస్థ దేశ ఆర్థిక, సామాజిక అభ్యున్నతికి అత్యంత ముఖ్యమైన ఆధారంగా నిలిచింది. ప్రతిరోజూ కోట్లాది మంది ప్రజలు వీటి ద్వారా తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాలను పరస్పరం అనుసంధానిస్తూ ఈ వ్యవస్థ ప్రజల జీవితంలో అంతర్భాగమైంది. అయితే, ఈ విశాలమైన రవాణా వ్యవస్థకు అంకురార్పణ పంతొమ్మిదో శతాబ్దపు మధ్యకాలంలో జరిగింది. భారతదేశపు తొలి ప్రయాణం దేశ రవాణా చరిత్రలో ఒక గొప్ప మైలురాయిగా నిలిచింది.
భారతదేశంలో మొదటి ప్రయాణికుల ధూమశకటంగా ఇది ప్రసిద్ధి చెందింది. ఇది 1853 ఏప్రిల్ 16న తన ప్రయాణాన్ని ప్రారంభించింది. అప్పటి ముంబయి నగరంలోని బోరీ బందర్ నుండి ఠాణే వరకు ఇది నడిచింది. ఈ రెండు ప్రాంతాల మధ్య దూరం సుమారు ముప్పై నాలుగు కిలోమీటర్లు.
దీనిని నడిపేందుకు మూడు ఆవిరి యంత్రాలను ఉపయోగించారు. వాటి పేర్లు సాహిబ్, సింధ్ మరియు సుల్తాన్. ఈ యంత్రాలు కలిసి పద్నాలుగు పెట్టెలను (బోగీలను) లాగుతూ ముందుకు సాగాయి. అందులో సుమారు నాలుగు వందల మంది ప్రయాణించారు. ఆ కాలంలో ఇది ఒక అద్భుతమైన సాంకేతిక ఆవిష్కరణగా ప్రజలను ఆశ్చర్యానికి గురిచేసింది.
ఆ రోజుల్లో భారతదేశంలో రవాణా సౌకర్యాలు చాలా పరిమితంగా ఉండేవి. ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి చేరుకోవడానికి అనేక రోజులు పట్టేది. గుర్రపు బండ్లు, ఎద్దుల బండ్లు వంటి సాధనాలే ప్రధాన రవాణా మార్గాలుగా ఉండేవి. ఈ వ్యవస్థ ప్రవేశించిన తర్వాత ప్రయాణ సమయం గణనీయంగా తగ్గింది. అలాగే వాణిజ్యం, పరిపాలన, సమాచార మార్పిడి మరింత వేగంగా వృద్ధి చెందాయి.
మొదటి ప్రయాణం ప్రారంభమైన రోజు ఒక పెద్ద వేడుకలా జరిగింది. ఆ కార్యక్రమాన్ని చూడటానికి అనేక మంది అధికారులు, ప్రముఖులు హాజరయ్యారు. శకటం బయలుదేరే సమయంలో గౌరవ సూచకంగా తుపాకీ గర్జనలు వినిపించాయి. ప్రజలు ఈ కొత్త రవాణా సాధనాన్ని వింతగా గమనించారు. ఈ సంఘటన ప్రజలలో కొత్త ఆశలను కలిగించింది.
ఈ విజయవంతమైన ప్రయాణం తర్వాత దేశంలో పట్టాల నిర్మాణం వేగంగా విస్తరించింది. కొద్ది సంవత్సరాల్లోనే అనేక పట్టణాలు అనుసంధానమయ్యాయి. క్రమంగా ఈ వ్యవస్థ దేశమంతటా వ్యాపించి ప్రజల జీవన విధానంలో కీలక పాత్ర పోషించింది. వ్యవసాయం, వాణిజ్యం, పరిశ్రమలు అభివృద్ధి చెందడంలో ఇది ముఖ్య భూమికను పోషించింది.
1853లో ప్రారంభమైన ఆ చిన్న ప్రయాణం నేటి మహత్తర వ్యవస్థకు పునాది వేసింది. ముంబయి నుంచి ఠాణే వరకు నడిచిన తొలి శకటం భారతదేశ రవాణా చరిత్రలో కొత్త యుగానికి నాంది పలికింది. ఈ సంఘటన దేశాభివృద్ధి దిశగా జరిగిన చారిత్రక ఘట్టంగా ఎప్పటికీ గుర్తుండిపోతుంది.
(సి.హెచ్.ప్రతాప్)
