Wednesday, May 6, 2026
HomePoliticsAndhra Pradeshఅరకు పండుగకు వేళాయె

అరకు పండుగకు వేళాయె

జనవరి 29 నుంచి ‘అరకు ఫెస్ట్ – 2026’.. రాష్ట్ర పండుగగా ఘనంగా నిర్వహణ జిల్లా కలెక్టర్ ఎ ఎస్ దినేష్ కుమార్ అరకు, జనవరి 27: ప్రకృతి ఒడిలో సేదతీరాలనుకునే పర్యాటకులకు శుభవార్త, అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు లోయలో ఈ నెల (జనవరి) 29వ తేదీ నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు ‘అరకు ఫెస్ట్ – 2026’ అట్టహాసంగా జరగనుంది. గతేడాది ‘చలి అరకు ఫెస్టివల్’ విజయవంతం కావడంతో, గిరిజన సంస్కృతిని, అరకు అందాలను ప్రపంచానికి చాటిచెప్పేలా ఈ ఉత్సవాలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోందని జిల్లా కలెక్టర్ ఎ ఎస్ దినేష్ కుమార్ అన్నారు.మంగళవారం అరకు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన పత్రిక సమావేశంలో మాట్లాడుతూ. జనవరి 29వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరకు వేలి లోని డిగ్రీ కాలేజీ గ్రౌండ్స్‌లో ఈ వేడుకలను అధికారికంగా ప్రారంభిస్తారు. పర్యటనలో భాగంగా ఆయన చొంపి గ్రామాన్ని సందర్శించి, అక్కడ అమలు చేస్తున్న హోమ్‌స్టే పాలసీని పరిశీలించనున్నారు. గిరిజన ఇళ్లలో పర్యాటకుల బస, వారి ఆతిథ్యంపై ముఖ్యమంత్రి స్వయంగా గిరిజనులతో చర్చించనున్నారు. పర్యాటకులకు థ్రిల్లింగ్ అనుభూతిని అందించేందుకు ఈసారి భారీగా ఏర్పాట్లు చేశారు, మాడగడ ప్రాంతంలో పారా గ్లైడింగ్, పారా మోటరింగ్‌తో పాటు, పర్యాటకుల కోసం ప్రత్యేకంగా హెలికాప్టర్ (చాపర్) రైడ్, హాట్ ఎయిర్ బెలూన్లను అందుబాటులోకి తెస్తున్నారు. వైజాగ్ టీమ్ ఆధ్వర్యంలో తొలిసారిగా స్కూబా డైవింగ్ వంటి సాహస క్రీడలను ప్రవేశపెడుతున్నారు. అనంతరం గాలి కొండ, సుంకరమెట్ట ప్రాంతాల్లో ట్రెక్కింగ్ ఉంటుంది. జనవరి 31న 5 కె రన్ (అరకు మారథాన్) నిర్వహించడం జరుగుతుందన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రాష్ట్రాల గిరిజన తెగలు తమ సంప్రదాయ నృత్యాలు, కళలతో భారీ కార్నివాల్‌ నిర్వహించనున్నారు. ఈశాన్య రాష్ట్రాలు, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, తెలంగాణ వంటి రాష్ట్రాల నుంచి వచ్చే కళాకారులు స్టాల్స్ ఏర్పాటు చేస్తారు. ఇక్కడ లభించే గిరిజన హస్తకళా వస్తువులను పర్యాటకులు రాయితీ ధరలకే కొనుగోలు చేయవచ్చు.పద్మాపురం గార్డెన్స్‌లో అద్భుతమైన ఫ్లవర్ షో, సరికొత్త ‘అరకు బొకే’ ఆవిష్కరణ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.తిరుపతి ఇండియన్ క్యులినరీ ఇన్స్టిట్యూట్ సహకారంతో విశిష్ట గిరిజన వంటకాలను పర్యాటకులకు వడ్డించనున్నారు. ప్రతిరోజూ సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రముఖ గాయని సునీత కు లైవ్ కాన్సర్ట్ ఉంటుంది. ముగింపు వేడుకల్లో భాగంగా ఫిబ్రవరి 1న ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్.ఎస్. థమన్ లైవ్ షోతో పాటు, ఆకాశంలో అద్భుతమైన డ్రోన్ షో నిర్వహించనున్నారు.ఈ వేడుకలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, ‘శ్రేయాస్ మీడియా’ ఈవెంట్ మేనేజర్‌గా వ్యవహరిస్తున్నట్లు అధికారులు తెలిపారు. పర్యాటకులు మారథాన్, సైక్లింగ్ పోటీలకు ఆన్‌లైన్ లేదా క్యూఆర్ కోడ్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు.ఈ పత్రికా సమావేశంలో ఎస్పీ అమిత్ బర్దర్, డిఎస్పి అభిషేక్ ఉన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments