ఈ నెల 29వ తేదీ గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి అరకు పర్యటనకు రానున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లను యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తోంది. అరకులో ఘనంగా నిర్వహించనున్న “చలి ఉత్సవ్” కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. ఈ మేరకు మంగళవారం జిల్లా కలెక్టర్ ఎ.ఎస్. దినేష్ కుమార్ పర్యటన ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ అరకులోని ప్రధాన వేదిక, హెలిపాడ్, హోమ్ స్టే ప్రాంతాలను సందర్శించారు. హెలిపాడ్ వద్ద భద్రతా ప్రమాణాలు, బారికేడింగ్ పనులను పరిశీలించి, పైలట్ల నిబంధనల మేరకు పనులు ఉండాలని సూచించారు. సభకు వచ్చే గిరిజన ప్రజలకు, పర్యాటకులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా త్రాగునీరు, మరియు మొబైల్ టాయిలెట్ల సౌకర్యం కల్పించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. “అరకు చలి ఉత్సవం జిల్లా ప్రతిష్టను పెంచే కార్యక్రమం. ముఖ్యమంత్రి పర్యటన దృష్ట్యా ఎక్కడా చిన్న పొరపాటుకు కూడా తావు లేకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలి. ట్రాఫిక్ మళ్లింపులు, భద్రతా ఏర్పాట్లపై పోలీసు శాఖతో సంప్రదించి చర్యలు తీసుకోవాలి” అని తెలిపారు.
ఈ పర్యవేక్షణలో ఐటిడిఏ పిఓ తిరుమణి శ్రీపూజ, సహాయ కలెక్టర్ సాహిత్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
