లక్ష్మీవానిపాలెం స్కూల్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన గంటా జీవీఎంసీ 6 వ వార్డు లక్ష్మీవానిపాలెం స్కూల్ భవనం మరమ్మతులను యుద్ధప్రాతిపదికన మొదలు పెట్టాలని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు. శనివారం 6 వ వార్డు పర్యటనలో భాగంగా స్కూల్ ను ఆకస్మిక తనిఖీ చేశారు. భవనం పెచ్చులూడి పోతున్నందున విద్యార్థుల భద్రత పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. మరమ్మతులతో సమస్య పరిష్కారం కాని పక్షంలో స్కూల్ ను వేరే సురక్షిత భవనానికి తరలించాలని సూచించారు. ప్రహరీ గోడ కూడా పడిపోయే పరిస్థితిలో ఉన్నందున ఎలాంటి ప్రమాదం తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. స్కూల్ విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని రుచి చూశారు. సౌకర్యాల గురించి, విద్యా బోధన గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పార్కు నిర్వహణ భేష్ పీఎం పాలెం ఆఖరి బస్టాప్ హెచ్.బి.కాలనీ సమీపంలోని యోగా థీమ్ పార్కును నిర్వహిస్తున్న అసోసియేషన్ ను గంటా అభినందించారు. వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసుకోవడం సహా పార్కుకు వచ్చే వారు కూర్చోవడానికి వెసులుబాటు కల్పిస్తున్నామని, ఫంక్షన్ల కోసం పార్కు ప్రదేశాన్ని అద్దెకు ఇస్తున్నామని నిర్వాహకులు వివరించారు. పార్కును చక్కగా అభివృద్ధి చేస్తున్న అసోసియేషన్ ను ఆదర్శంగా తీసుకుని.. మిగిలిన ప్రాంతాల్లో కూడా ఆయా కాలనీ అసోసియేషన్లు పార్కులను దత్తత తీసుకోవాలని సూచించారు. కాలనీ వాసులు రూ.5 లక్షలు ఖర్చు చేసి పార్కులో మౌలిక సదుపాయాలు కల్పించామని తెలియజేయగా.. ఇకమీదట పార్కులో కావాల్సిన పనులు జీవీఎంసీ చేపడుతుందని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అనంతరం పీఎం పాలెంలో జీవీఎంసీ ఓపెన్ స్పేస్ స్థలాన్ని సందర్శించి.. ఆ ఖాళీ స్థలంలో తక్షణమే పార్కు, వాకింగ్ ట్రాక్ వంటి వసతులను ఏర్పాటు చేయాలన్నారు.
*రోడ్డు మీద డెబ్రీస్ ఇంకా ఎంతకాలం ఉంచుతారు?*
పీఎం పాలెం మెయిన్ రోడ్డు వెంబడి డ్రైనేజీ పక్కనే కుప్పలుగా వేసిన డెబ్రీస్ ను తక్షణమే తొలగించాలని గంటా శ్రీనివాసరావు జీవీఎంసీ అధికారులను ఆదేశించారు. ప్రధాన కాల్వల పైన వేసిన ప్రైవేట్ పలకలను పగలగొట్టడం వల్ల పోగైన డెబ్రీస్ కారణంగా ట్రాఫిక్ కు కూడా ఇబ్బంది కలుగుతోంది. సంక్రాంతి ముందు చేపట్టిన స్పెషల్ డ్రైవ్ లో డెబ్రీస్ ఇప్పటికీ ఎందుకు క్లియర్ చేయలేదని జోనల్ కమిషనర్ అయ్యప్ప నాయుడిని, ఏసీపీ శాస్త్రిని ప్రశ్నించారు. ఇంకా ఎంతకాలం ఉంచుతారని అసహనం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కూటమి నేతలు చిక్కాల విజయ్ బాబు, యార్లగడ్డ జీవన్ కుమార్, గరే గుర్నాథ్, మాన్యాల సోంబాబు, మొల్లి లక్ష్మణరావు, దాసరి శ్రీనివాస్, లొడగల జానకిరామ్, నాగోతి సత్యనారాయణ, కృష్ణయ్య, సంతోష్ నాయుడు, గొల్లంగి ఆనంద్ బాబు, మామిడి దుర్గారావు, అచ్యుతరావు, నాగోతి సూర్య ప్రకాష్, పి. నాగేశ్వరరావు, వర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
