కొక్కిరాపల్లి వద్ద రోడ్డు ప్రమాదం
• ఇద్దరు మృతి 12 మందికి తీవ్ర గాయాలు
• కాన్వాయ్ తో వెళ్తూ ప్రమాద ఘటన వద్ద ఆగి క్షతగాత్రులకు సేవలందించిన హోం మంత్రి అనిత
• యలమంచిలి ఆస్పత్రిలో హోంమంత్రి, ఎమ్మెల్యే క్షతగాత్రులకు ఓదార్పు
యలమంచిలి, జయ జయహే న్యూస్ : యలమంచిలి పట్టణ సమీపంలో కొక్కిరాపల్లి జంక్షన్ జాతీయ రహదారిపై సోమవారం ఉదయం ఆటోను టాటా ఏస్ వాహనం ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, 12 మందికి తీవ్ర గాయాలైనాయి. ఇదే మార్గంలో విశాఖ నుంచి పాయకరావుపేట వైపు ప్రయాణిస్తున్న రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత కాన్వాయ్ తో వెళుతూ ప్రమాదాన్ని చూసి ఆగిపోయి ప్రమాదానికి గురైన క్షతగాత్రులకు స్వయంగా సహాయక సేవలందించారు. తాళ్లపాలెం నుంచి యలమంచిలి వైపు వస్తున్న సర్వీస్ ఆటోను కొక్కిరాపల్లి ప్రేమ సమాజం వద్ద వెనుకవైపు వస్తున్న టాటా మ్యాజిక్ వాహనం ఆటోను ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన స్థలం వద్ద బోల్తా పడిన ఆటో టాటా మ్యాజిక్ వాహనంలో ఇరికిపోయిన క్షతగాత్రులను హోం మంత్రి అనిత పోలీస్ అధికారులు కలిసి బయటకు తీశారు. తీవ్ర గాయాలైన క్షతగాత్రులందరినీ యలమంచిలి సిహెచ్ తరలించి సత్వర వైద్య సేవలకు ఆదేశించారు. సిహెచ్ లో హోం మంత్రి అనిత తో పాటు ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ లు ఇద్దరు కలిసి వైద్యులను అప్రమత్తం చేసి క్షతగాత్రులకు వైద్య సేవలు అందించేలా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో కన్నీటి పర్యంతమవుతున్న క్షతగాత్రులను హోంమంత్రి, ఎమ్మెల్యే లు ఇద్దరు ధైర్యం చెప్పి ఓదార్చారు. డాక్టర్ నిహారిక వైద్య సిబ్బంది అంతా క్షతగాత్రులకు వైద్య సేవలు అందించి విశాఖ కేజీహెచ్ కు మరి కొంతమందిని అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించారు. అనకాపల్లి ఆసుపత్రిలో కసింకోట మండలం తేడా గ్రామానికి చెందిన గొంది పెంటయ్య 56, నర్సీపట్నం ధనిమిరెడ్డి వీరికి చెందిన బాదంపూడి లక్ష్మి లో మృతి చెందారు. మిగిలిన 12 మంది క్షతగాత్రులు విశాఖ కేజీహెచ్, అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించగా వైద్య సేవలు పొందుతున్నట్లు యలమంచిలి సీఐ ధనుంజయరావు తెలిపారు. ఆటోను ఢీకొన్న టాటా మ్యాజిక్ వాహనం అమిత వేగంతో వచ్చి హైవేపై లారీని తప్పించే క్రమంలో ఆటోను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక సిఐ రాంబాబు, టౌన్ ఎస్ఐ కే సావిత్రి, రూరల్ ఎస్ ఐ ఉపేంద్ర, పోలీస్ సిబ్బంది, ఫైర్ సిబ్బంది, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
