ఇన్ఛార్జి మంత్రి బాల వీరాంజనేయ స్వామి
జిల్లా కలెక్టర్గా ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ అందించిన సేవలు అభినందనీయమని జిల్లా ఇన్ఛార్జి మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. కలెక్టర్ కు దుశ్సాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు. గత 20 నెలల కాలంలో ప్రజలకు అనేక విధాలుగా ఉత్తమ సేవలు అందించిన హరేంధిర ప్రసాద్ పరిపాలనలో ప్రత్యేక ముద్ర వేశారని కొనియాడారు. ప్రజా సమస్యల పరిష్కారంలో చురుకుగా వ్యవహరించి, సహనంతో, శాంతియుత వాతావరణంలో అందరి ప్రశంసలు అందుకున్నారన్నారు. ప్రపంచ స్థాయి కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించడం ద్వారా జిల్లాకు మంచి గుర్తింపు తీసుకువచ్చారని, ప్రజల పట్ల గౌరవం, బాధ్యతతో విధులు నిర్వహించారని వెల్లడించారు. ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ హరేంధిర ప్రసాద్ ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచే కలెక్టర్గా గుర్తింపు పొందారన్నారు. ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులు నాయుడు, ఎమ్మెల్యేలు గణబాబు, రామకృష్ణ బాబు, ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ ఛైర్మన్ సీతంరాజు సుధాకర్ తదితరులు పాల్గొని కలెక్టర్ సేవలను ప్రశంసించారు. నేమ్ బోర్డుపై ఎంతమంది కలెక్టర్ల పేర్లు ఉన్నా, ప్రజల హృదయాల్లో మాత్రం హరేంధిర ప్రసాద్ పేరు నిలిచిపోతుందని పేర్కొన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయి కార్యక్రమాల నిర్వహణలో ఆయన ప్రత్యేక ప్రతిభ కనబరిచారని, బృందస్ఫూర్తితో సమర్థవంతమైన పాలన అందించారని అభినందించారు. జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ మాట్లాడుతూ తన విధి నిర్వహణలో ప్రభుత్వం, ఇన్ఛార్జి మంత్రి, ప్రజా ప్రతినిధులు మరియు అధికారుల సంపూర్ణ సహకారం అందించారని అందుకు సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
