డా || ఇ వి నారాయణ
కౌండిన్య ఐఏఎస్ అకాడమి ఆధ్వర్యంలో త్వరలో పేద మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్ శిక్షణ మరియు ప్రతిభ గల పేద విద్యార్థులకు ఉచితంగా కంప్యూటర్ శిక్షణ, స్పోకెన్ ఇంగ్లీష్ పై శిక్షణ కార్యక్రమాలు ప్రారంభిస్తామని కౌండిన్య ఐఏఎస్ అకాడమీ వ్యవస్థాపకులు డా|| ఇ వి నారాయణ పేర్కొన్నారు. ఈనెల 16వ తేదీన గుంటూరులో వారి స్వగృహములో జరిగిన మీడియా సమావేశంలో శాసనమండలి మాజీ సభ్యులు కె ఎస్ లక్ష్మణరావు, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి తో పాటు కౌండిన్య ఎడ్యుకేషనల్ ట్రస్ట్ నేతలు వాక రామగోపాల్ గౌడ్, డా || టి. సేవ కుమార్, జల్లెడ శ్రీనివాసరావు, డా|| ఎన్. కృష్ణ లు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్సీ కె. ఎస్. లక్ష్మణరావు ప్రసంగిస్తూ డా || ఇ.వి. నారాయణ 20 సంవత్సరాల క్రితం ప్రారంభించిన కౌండిన్య ఎడ్యుకేషనల్ ట్రస్ట్ కు 2.25 కోట్ల విరాళాలు దాతలు అందించారని,వాటి వడ్డీ ద్వారా వచ్చిన 2.25 కోట్ల రూపాయలను ప్రతిభ గల పేద విద్యార్థులకు స్కాలర్ షిప్ లను అందించారని తెలిపారు. పేద విద్యార్థులలో సృజనాత్మకత శక్తిని పెంచి పోటీ పరీక్షల్లో విజేతలుగా నిలపాలనే సదుద్దేశంతో 8 కోట్ల రూపాయల దాతల విరాళాలతో కౌండిన్య ఐఏఎస్ అకాడమి ని స్థాపించారన్నారు. జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ప్రసంగిస్తూ డా || ఇ. వి.నారాయణ అధ్యాపకులందరికీ రోల్ మోడల్ గా నిలుస్తున్నారన్నారు. వెనిగండ్ల సమీపంలో గల కౌండిన్య ఐఏఎస్ అకాడమీ ప్రాంగణంలో త్వరలో మహిళలకు ఉచిత కుట్టుమిషన్ల శిక్షణ, యువతకు ఉచిత కంప్యూటర్ శిక్షణ మరియు స్పోకెన్ ఇంగ్లీష్ పై ఉచితంగా క్లాసులు నిర్వహించాలని తలపెట్టడం హర్షణీయమన్నారు.
ఆంధ్రప్రదేశ్ లో మానవ వనరులకు కొరత లేదని వారిలో నైపుణ్యాలను పెంపొందిస్తే సమాజాభివృద్ధి వేగవంతం అవుతుందని వివరించారు. ఈ సందర్భంగా కౌండిన్య ఎడ్యుకేషనల్ ట్రస్ట్, కౌండిన్య ఐఏఎస్ అకాడమీ వ్యవస్థాపకులు డా || ఇ. వి.నారాయణ ను శాలువ కప్పి సత్కరించారు.
