శాసనమండలిలో మంత్రి సవిత
* ఏప్రిల్ 1 నుంచి ఉచిత విద్యుత్ అమలు
* మగ్గం నేతన్నలకు 200 యూనిట్లు
* మర మగ్గం నేతన్నలకు 500 యూనిట్లు ఉచితం
ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి నేతన్నలకు ఉచిత విద్యుత్ అందజేయనున్నామని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. చేనేత వృత్తిలో కొనసాగే వారందరికీ ఈ పథకం వర్తింపజేయనున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా మూడో రోజు శుక్రవారం శాసనమండలిలో ప్రశ్నోత్తర సమయంలో వైసీపీ సభ్యులు మురుగుడు హనుమంతరావు అడిగిన ప్రశ్నకు రాష్ట్ర చేనేత, జౌళి శాఖామాత్యులు ఎస్.సవిత పైవిధంగా సమాధానం చెప్పారు.
పోగును వస్త్రంగా మార్చి మనుష్యుల ఆత్మగౌరవాన్ని కాపాడే మహానీయులు నేతన్నలని కొనియాడారు. చేనేతలకు అన్న ఎన్టీఆర్ తొలుత అండగా నిలుస్తే, 2014-19లో సీఎం చంద్రబాబునాయుడు పాలన నేతన్నలకు స్వర్ణయుగంలా గడిచిందని తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి నేతన్నలకు ఉచిత విద్యుత్ అందజేయబోతున్నామన్నారు. చేనేత వృత్తిలో ఉన్న వారందరూ ఉచిత విద్యుత్ కే అర్హులేనన్నారు. మగ్గం నేసే నేతన్నలకు 200 యూనిట్ల అందజేయబోతున్నామని, దీనివల్ల ఆయా నేతన్నల కుటుంబాలకు నెలకు రూ.720లు, ఏడాదికి రూ.8,640లు ఆదా కానుందన్నారు. మర మగ్గం నేసే నేతన్నలకు 500 యూనిట్లు ఉచితంగా సరఫరా చేయనున్నామని, దీనివల్ల ఆయా కుటుంబాలకు రూ.1,800లు, ఏడాదికి రూ.21,600 ఆర్థికంగా మేలు చేకూరనుందన్నారు. 2014-19 మాదిరిగా కూటమి ప్రభుత్వం వచ్చిన తరవాత కూడా త్రిఫ్ట్ ఫండ్ నిధులు అందజేస్తున్నామన్నారు. అవసరమైన మేరకు చేనేత సహకార సంఘాల నుంచి చేనేత వస్త్రాలు కొనుగోలు చేస్తున్నామని, గతంలో చేనేత సహకార సంఘాలకు పెట్టిన బకాయిలు కూడా చెల్లిస్తున్నామని వెల్లడించారు. 50 ఏళ్లు నిండిన నేతన్నలకు పెన్షన్లు ఇచ్చిన ఘనత సీఎం చంద్రబాబుదేనని తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరవాత నేతన్నలకు ఇచ్చే పెన్షన్ల మొత్తాన్ని రూ.3 వేల నుంచి రూ.4 వేలకు పెంచామని, నేటి వరకూ రూ.495 కోట్లు పెన్షన్ల రూపంలో అందజేశామని వెల్లడించారు.
