– హాజరవుతున్న రాష్ట్ర గవర్నర్, చాన్సలర్ ఎస్.అబ్దుల్ నజీర్
-ముఖ్య అతిధిగా బ్యాంక్ అఫ్ అమెరికా వైస్ చైర్మన్ డాక్టర్ పూర్ణ చంద్రరావు సగ్గుర్తి
ఆంధ్రవిశ్వవిద్యాలయ 91,92వ సంయుక్త స్నాతకోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. బీచ్రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ సెంటర్ వేదికగా జరగనున్న స్నాతకోత్సవ ఏర్పాట్లను వీసీ ఆచార్య జి.పి రాజశేఖర్ అధికారులతో కలసి స్వయంగా పర్యవేక్షించారు. వీసీ వెంట ఏయూ రెక్టార్ ఆచార్య పి.కింగ్, రిజిస్ట్రార్ ఆచార్య కె.రాంబాబు, అకడమిక్ డీన్ ఆచార్య కె.శ్రీనివాస రావు, ప్రిన్సిపాల్స్, డీన్లు తదితరులు పాల్గొన్నారు. వేదికను సుందరంగా పుష్పాలతో అలంకరించారు. కన్వెన్షన్ సెంటర్ సుందరంగా తీర్చిదిద్దారు. స్నాతకోత్సవంలో పట్టాలు తీసుకునే వారికి కూర్చోవడానికి సీటింగ్ ఏర్పాట్లు పూర్తిచేసి, వారితో వచ్చే కుటుంబ సభ్యులకోసం ప్రత్యేకంగా సీటింగ్ ఏర్పాటు చేశారు. ఇప్పటికే వీరికి అవసరమైన అడ్మిట్ కార్డులు, పాస్లను సంబంధిత విభాగాల సిబ్బంది పంపిణీ చేశారు. సాయంత్రం గవర్నర్ కాన్వాయ్ ట్రయల్ రన్, సెక్యూరిటీ సిబ్బంది కార్యక్రమ నిర్వహణపై ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా సిబ్బందికి పలు సూచనలు చేసారు.
బుధవారం ఉదయం జరిగే స్నాతకోత్సవానికి ఏయూ చాన్సలర్, రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ హాజరవుతున్నారు. కార్యక్రమంలో రాష్ట్ర విద్య శాఖ మంత్రి నారా లోకేష్ పాల్గొంటారు. స్నాతకోత్సవానికి ముఖ్య అతిధిగా బ్యాంక్ ఆఫ్ అమెరికా వైస్ చైర్మన్, ఏయూ పూర్వ విద్యార్థి డాక్టర్ పూర్ణచంద్రరావు సగ్గుర్తి హాజరవుతున్నారు. ఆంధ్రవిశ్వవిద్యాలయం తరపున ఆయనకు గౌవర డాక్టరేట్ను ప్రధానం చేస్తారు. సాహిత్య విభాగంలో విశేష సేవలకు గుర్తింపుగా కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు గ్రహీత తల్లావజ్ఝల పతంజలి శాస్త్రి కి ఏయూ తరపున డాక్టరేట్ ప్రధానం చేయనున్నారు.
స్నాతకోత్సవం ఉదయం 9 గంటలకు బీచ్రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ సెంటర్ వేదికగా ప్రారంభమవుతుంది. ఈ స్నాతకోత్సవంలో ఇద్దరు ఆచార్యులకు బెస్ట్ రీసెర్చ్ అవార్డులు, పిహెచ్డిలో రీసెర్చ్ మెడల్స్ 17 మందికి, రీసెర్చ్ ప్రైజ్లు 13 మందికి ప్రధానం చేస్తారు. 7గురు ఎం.ఫిల్ డిగ్రీలను, 441మంది పిహెచ్డి డిగ్రీలను అందుకుంటారు. యూజీ పీజీ మెడల్స్ 174, యూజీ పీజీ ప్రైజులు 437 అందిస్తారు. మెత్తం యూజీ పీజీ ప్రైజులు, మెడల్స్ 148 మందికి అందిస్తున్నారు.

