వైకాపా ఎన్ని పాదయాత్రలు చేసినా మళ్లీ అధికారంలోకి రావడం అసాధ్యమని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఘాటుగా వ్యాఖ్యానించారు. లోకేష్ పాదయాత్ర సందర్భంగా యువత డీఎస్సీ, ఉద్యోగాలు, రాష్ట్ర భవిష్యత్తుపై ప్రశ్నలు అడిగారని, పార్టీ కార్యకర్తలు ఎదుర్కొంటున్న కష్టాలను నేరుగా తెలియజేశారని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్ ఏ ముఖం పెట్టుకుని మళ్లీ పాదయాత్రకు బయలుదేరుతున్నారని ప్రశ్నించారు.
చంద్రన్న బీమా, పండుగ కానుకలు రద్దు చేశారని, ఉద్యోగులకు జీతాలు సకాలంలో వేయలేని పరిస్థితి తీసుకొచ్చారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జీతాలు, అలవెన్సులు సక్రమంగా అందిస్తున్నామన్నారు. జగన్ పాదయాత్ర కాస్ట్లీగా ఉంటుందని, వుడెన్ ఫ్లోరింగ్, మసాజ్లు ఉంటాయని ఎద్దేవా చేశారు. శుక్రవారం వెళ్లి సోమవారం తిరిగొస్తారని విమర్శించారు. లోకేష్ మాత్రం విరామం లేకుండా కష్టాలు, దాడులు ఎదురైనా పాదయాత్ర పూర్తి చేశారని, అదే నిజమైన చిత్తశుద్ధి అని అన్నారు. తలకిందులుగా తపస్సు చేసినా వైకాపాకు అధికారం దక్కదని స్పష్టం చేశారు.
