పూర్ణకుంభ స్వాగతం పలికిన ఆలయ ట్రస్ట్ సభ్యులు
అనకాపల్లి (జయ జయహే) వేద విద్యా విశారదులు, సంస్కృత భాషా ప్రచారమే శ్వాసగా జీవిస్తున్న మహామహోపాధ్యాయ ధోర్భల ప్రభాకర శర్మ అనకాపల్లి పట్టణంలో డైట్ కాలేజ్ ఎదురుగుండా నిర్మాణంలో ఉన్న శ్రీ మంత్రిణి దండిణి సహిత శ్రీశ్రీశ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవాలయ ప్రాంగణాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ ట్రస్ట్ సభ్యులు మరియు భక్తులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు.
ముందుగా ధోర్బల ప్రభాకర్ శర్మ అంతరాలయంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ నిర్మాణ శైలిని, శిల్పకళను వారు నిశితంగా పరిశీలించి, నిర్మాణానికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ప్రభాకర శర్మ మాట్లాడుతూ. ఈ ప్రాంతానికి విశేషమైన దైవిక శక్తి ఉంది. ఆ ఆధ్యాత్మిక బలం వల్లనే అమ్మవారు ఇక్కడ కొలువుదీరుతున్నారు. ఆలయ నిర్మాణం అత్యంత అద్భుతంగా జరుగుతోంది. త్వరలోనే ఈ నిర్మాణ కార్యమంతా పూర్తయ్యి, అమ్మవారు భక్తులందరినీ అనుగ్రహించాలని మనసారా కోరుకుంటున్నాను” అని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ చైర్మన్ పసరకొండ వేంకట మల్లేశ్వర కిరణ్ శర్మ, కప్పగంతుల సాయి మురళీ శర్మ, కొమ్మాళ్లపల్లి నందన శర్మ, డాక్టర్ నిట్టల కృష్ణ ప్రసాద్, రేపాక రామకృష్ణ, శీలం నదియా, ఆవుపాటి త్రినాథ్, ఆడారి హేమ, భవ్యశ్రీ డెవలపర్స్ చైర్మన్ కాండ్రేకుల నాయుడు మరియు అధిక సంఖ్యలో అమ్మవారి భక్తులు పాల్గొని గురువుల ఆశీస్సులు అందుకున్నారు.
