బాలల మహా సభల లోగో (చిహ్నం) ఆవిష్కరించిన మంత్రి సత్య కుమార్ యాదవ్. – డా.గజల్ శ్రీనివాస్ , అధ్యక్షులు, ఆంధ్ర సారస్వత పరిషత్తు. ఆంధ్ర సారస్వత పరిషత్తు, బాల బాలికలలో తెలుగు భాష పట్ల అవగాహన, అనురాగం, స్వాభిమానం, బాధ్యత పెంపొందించాలనే లక్ష్యంతో “బాలల ప్రపంచ తెలుగు మహా సభలు – 2026″ నిర్వహించడానికి సంకల్పించింది. 16 ఏళ్ల లోపు బాల బాలికలలో మాతృభాషపై అవగాహన, ప్రేరణ, అనురాగం, బాధ్యతను పెంపొందించేందుకు,
తెలుగు భాషను ఒక స్వాభిమాన ప్రతీకగా వారు భావించేలా తీర్చిదిద్ది,
ప్రతిభావంతులైన బాల బాలికలను గుర్తించి శాస్త్రీయ శిక్షణ అందించి,
సంప్రదాయ కళలు , ఆధునిక సాంకేతికతల సమ్మేళనంగా తెలుగు వికాసాన్ని బాల బాలికల చేత ప్రదర్శింప జేయడమే ధ్యేయంగా 5,6 తేదీలు డిసెంబర్ 2026 న ఎంతో ప్రతిష్టాత్మకంగా బాలల ప్రపంచ తెలుగు మహా సభలు నెక్ట్స్ జన్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రాంగణం, ఒంగోలు లో నిర్వహిస్తామని, షుమారు 50 దేశాల నుండి బాల బాలికలు పాల్గొంటారని డా.గజల్ శ్రీనివాస్ తెలిపారు.
నెక్ట్స్ జన్ స్కూల్ ప్రాంగణం ఒంగోలు లో నిర్వహించిన ” బాలలే మాతృ భాషకు భవిత” సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్స్ వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి సత్య కుమార్ యాదవ్ బాలల ప్రపంచ మహా సభల లోగోను ఆవిష్కరించారు.
వేలాది మంది బాల బాలికలు ఆ మహా సభలలో అష్టావధానం, పద్య నాటకం, పద్య రచన, కథా, కవితా , గేయ రచన, హరికథ, బుర్రకథ, శాస్త్రీయ , లలిత , చలన చిత్ర సంగీత గాన కార్యక్రమాల్లో పాల్గొనడం, వేయ మందికి పైగా బాల బాలికలు కవి సమ్మేళనంలో పాల్గొనడం, కూచిపూడి,.జానపద నృత్య ,, కోలాట, కత్తి సాము వంటి ప్రదర్శనలలో పాలు పంచుకోవడం వల్ల తెలుగు భాష వికాసం కోసం ఒక కొత్త తరం సిద్ధం కావడం ఆనందంగా వుందని, డా.గజల్ శ్రీనివాస్ బాలల కోసం తెలుగు మహా సభలు తీర్చి దిద్దడం స్ఫూర్తి దాయకమని మంత్రి సత్య కుమార్ యాదవ్ ప్రశంసించారు.
డా. కె.మురళీ ధర్ రెడ్డి , కోగంటి శ్రీకాంత్ లకు ఈ సభల ముఖ్య సమన్వయ కర్తలుగా నియమిస్తూ నియామక పత్రాలను మంత్రి సత్య కుమార్ డా.గజల్ శ్రీనివాస్ చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డీ పట్టాభిరామ్, శాసనసభ్యులు దామచర్ల జనార్దన్, జిల్లా కలెక్టర్ రాజు బాబు, పరిషత్ సభ్యులు అడ్డాల వాసు, లఖంరాజు సునీత తదితరులు పాల్గొన్నారు.
