కలెక్టరేట్లోనే నియమాలకు తూట్లు!
రాజమహేంద్రవరం, జయజయహే ప్రతినిధి:
ప్రజల పన్నుల రూపంలో వచ్చే ప్రభుత్వ విద్యుత్ను వ్యక్తిగత అవసరాలకు వినియోగించడం ఎంతవరకు సమంజసం? తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్ (బొమ్మూరు)లో చోటుచేసుకున్న ఘటన ఇప్పుడు ఇదే ప్రశ్నను ముందుకు తెచ్చింది. గురువారం కలెక్టరేట్లోని ఓ విభాగంలో ఉద్యోగి తన వ్యక్తిగత ఈవీ వాహనాన్ని కార్యాలయ ప్లగ్ పాయింట్కు కనెక్ట్ చేసి చార్జింగ్ చేస్తున్న దృశ్యం కెమెరాలో బంధించబడింది.
కలెక్టరేట్ వంటి కీలక ప్రభుత్వ కేంద్రంలోనే ఇలాంటి చర్యలు జరగడం ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వ కార్యాలయాల్లో వినియోగించే విద్యుత్ ప్రజాసొమ్ము. ఆ సొమ్ముతో వ్యక్తిగత వాహనాలకు చార్జింగ్ చేయడం నిబంధనలకు విరుద్ధమా? క్రమశిక్షణ ఎక్కడ? బాధ్యత ఎక్కడ? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
ప్రభుత్వ కార్యాలయాల్లో ఈవీ చార్జింగ్ కోసం ప్రత్యేక సదుపాయాలు ఏర్పాటు చేసినట్లయితే స్పష్టత ఇవ్వాలి. లేకపోతే సాధారణ విద్యుత్ లైన్లను వ్యక్తిగత వాహనాల కోసం వినియోగించడం దుర్వినియోగంగా పరిగణించాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకరు చేస్తే ఇంకొందరు అనుసరించే ప్రమాదం ఉందని ఉద్యోగులే చెబుతున్నారు.
ఈ ఘటనపై జిల్లా ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి, విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. “ప్రజల సొమ్ము – వ్యక్తిగత సౌకర్యాలకు కాదు” అనే సందేశాన్ని స్పష్టంగా ఇవ్వాల్సిన అవసరం ఉందని ప్రజలు పేర్కొంటున్నారు.
ప్రభుత్వ కరెంటుతో వ్యక్తిగత ఈవీలకు చార్జింగ్?
RELATED ARTICLES
