భారతీయ జనతా పార్టీ 47వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు రాజమండ్రిలో ఘనంగా నిర్వహించారు . జిల్లా బీజేపీ అధ్యక్షులు పిక్కి నాగేంద్ర ఆధ్వర్యంలో జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి హాజరై పార్టీ జెండా ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు.
తదుపరి ఎంపీ పురందేశ్వరి, పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి కార్యాలయం నుండి ర్యాలీగా బయలుదేరి వై జంక్షన్, అశోక థియేటర్, చర్చ్ ముగ్గుపేట ప్రాంతాల మీదుగా ప్రయాణించి మాజీ ప్రధాని అటల్ బిహారి వాజపేయి విగ్రహం వద్దకు చేరుకుని ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి మాట్లాడుతూ, బీజేపీ స్థాపించి 46 సంవత్సరాలు పూర్తి చేసుకుని 47వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా పార్టీ మహనీయుల త్యాగాలను స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. 1980లో జనసంఘ్ నుండి బీజేపీ రాజకీయ శక్తిగా అవతరించిన విషయాన్ని గుర్తు చేశారు.
అంకితభావంతో పనిచేసిన కార్యకర్తలు, నాయకుల సేవలను స్మరించుకుంటూ తిరిగి పార్టీ సేవకు అంకితం కావాల్సిన సమయమని పిలుపునిచ్చారు. పార్టీ ఆరంభ దశలో తీసుకున్న సిద్ధాంతాలను మరవకుండా నేటికీ అదే ధృఢ నిబద్ధతతో ముందుకు సాగుతోందని తెలిపారు.
అలాగే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలను ప్రస్తావిస్తూ, జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్ రద్దు వంటి సంస్కరణలను ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో అమలు చేసినట్లు చెప్పారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి అంతోదయ సిద్ధాంతంతో కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం పేదల సంక్షేమం దిశగా అనేక పథకాలు అమలు చేస్తోందని, ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తోందని వివరించారు. బీజేపీ ఓట్ల రాజకీయాలకు అతీతంగా దేశ ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతోందని తెలిపారు.
ప్రజా రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించినందుకు ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
