వారి విధి విధానాలు నిత్యం పరిశీలించాల్సిందే
– జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్.
మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ అన్ని జోన్లలో నిత్యం పారిశుద్ధ్య కార్మికుల హాజరును ,విధివిధానాలను పరిశీలించాలని, పారిశుద్ధ్య పనుల పట్ల కార్మికులు అలసత్వం వహించకుండా నిత్య పర్యవేక్షణ జరపాలని ప్రజారోగ్య అధికారులను జీవీఎంసీ కమిషనర్ ఆదేశించారు. మంగళవారం ఆయన ఈస్ట్ జోన్ 16 ఇసుకతోట, 17 వార్డులలో నేతాజీ పార్కులో వార్డు కార్యాలయం , ముడసర్లోవ లో గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేశారు. కమిషనర్ ముందుగా ఈస్ట్ జోన్ 17వ వార్డులో వార్డ్ ఆఫీసును సందర్శించి పారిశుధ్య కార్మికుల హాజరును పరిశీలించారు. పలువురు పారిశుధ్య కార్మికులు విధులకు ఆలస్యంగా హాజరవుతున్నందుకు కారణాలను సహాయక వైద్యాధికారి బి.ప్రసాద్ రావు ను అడిగి తెలుసుకున్నారు. అన్ని జోన్లలో అన్ని వార్డులలో ఉదయం 6 గంటల తర్వాత విధులకు హాజరైన పారిశుధ్య కార్మికుల జాబితాను తయారుచేసి నివేదికను పంపించాలని , అందుకు తగిన చర్యలను కూడా చేపట్టాలని , పారిశుధ్య పనుల పట్ల కార్మికుల పనితీరుపై నిత్య పర్యవేక్షణ జరపాలని ఫోన్ ద్వారా ప్రధాన వైద్యాధికారి డాక్టర్ ఈ ఎన్ వి నరేష్ కుమార్ కు కమిషనర్ ఆదేశించారు. అనంతరం 16 వ వార్డు ఇసుకతోట సమీపంలో టీఎంఎక్స్ 20 వాహన పనితీరును పరిశీలించారు. ఎన్ని గంటలకు వాహనాలు వస్తున్నాయి, వాటి మీటర్ రీడింగు ను నిత్యం నమోదు చేసి వాహనాల పనితీరును పరిశీలించాలని వార్డు శానిటరీ కార్యదర్శి కి ఆదేశించారు. అనంతరం ముడసర్లోవ లో గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ ను సందర్శించి క్లాప్ వాహనాల పనితీరు వాటి నిర్వహణను గమనిస్తూ వాహనాల రాకపోకలను, డ్రైవర్ల పనితీరును నిత్యం పరిశీలించాలని అధికారులకు ఆదేశించారు.
