నిర్మాత బీఆర్ అంబేద్కర్ ఆశయాలు, ఆలోచన విధానాన్ని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ కిషోర్ మక్వీనా అన్నారు.
శనివారం ధవళేశ్వరం లోని ఓఎన్జీసీ ఎసెట్ వర్క్షాప్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా కిషోర్ మక్వానా మాట్లాడుతూ అంబేద్కర్ను కేవలం రాజ్యాంగ నిర్మాతగా లేదా దళిత నాయకుడిగా కాకుండా ప్రపంచ నాయకుడిగా గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. ఆయన ఒక వ్యక్తి మాత్రమే కాదని, మహాశక్తిగా నిలిచిన మహానేత అని కొనియాడారు. అటువంటి మహనీయుడి విగ్రహాన్ని ఆవిష్కరించడం తనకు లభించిన అదృష్టమని తెలిపారు.
మానవాళిలో అందరిలో ప్రవహించేది ఒకే రక్తమని, కులమత భేదాలకు అతీతంగా సమాజం నిర్మించినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి జీవితాన్ని అంకితం చేసిన మహానేత అంబేద్కర్ అని కొనియాడారు. విద్య, ఉత్తమ వ్యక్తిత్వం, నిరంతర కృషి ద్వారా సమాజంలోని అసమానతలను తొలగించవచ్చన్నారు.
యువత కేవలం డిగ్రీల కోసం కాకుండా సామాజిక స్పృహతో విద్యను అభ్యసించాలని సూచించారు. దళిత యువత ఉద్యోగాలకే పరిమితం కాకుండా తమ నైపుణ్యాలను పెంపొందించుకుని సంస్థలను స్థాపించి వ్యాపారవేత్తలుగా ఎదగాలని ఆకాంక్షించారు.
జాతీయ ఎస్సీ కమిషన్ సెక్రటరీ జి. శ్రీనివాస్ మాట్లాడుతూ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత మాత్రమే కాకుండా సమాజ అభివృద్ధికి సంబంధించిన అనేక అంశాలపై అపార అవగాహన కలిగిన మేధావి అని పేర్కొన్నారు. మహిళా హక్కులు, కార్మిక చట్టాలు వంటి అనేక అంశాలను రాజ్యాంగంలో పొందుపరిచారని వివరించారు.
అనంతరం చైర్మన్ ఇతర సభ్యులతో కలిసి ధవళేశ్వరం ప్రాంతంలోని ధవలేశ్వరం బ్యారేజ్ ను జాయింట్ కలెక్టర్ వై. మేఘా స్వరూప్ తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా బ్యారేజ్కు సంబంధించిన వివరాలను అధికారులు వివరించారు.
కార్యక్రమంలో ఓఎన్జీసీ ఎసెట్ మేనేజర్ హేమంత్ రాములు ముల్క, ఏఐఎస్సీస్టీఈడబ్ల్యూఏ చైర్మన్ కొమ్ము సత్యనారాయణ, జాతీయ ఎస్సీ కమిషన్ డైరెక్టర్ గెడ్డం సునీల్ కుమార్ బాబు, రాజకుమార్, ప్రశాంత్ కుమార్, తాళ్లూరి బాబు రాజేంద్ర, ప్రసాద్, కోరుకొండ చిరంజీవి తదితరులు, అసోసియేషన్ నాయకులు, ఓఎన్జీసీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
