షిప్పింగ్ ఉద్యోగి మృతి
జాతీయ రహదారి పై గురువారం ఉదయం చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు.మధురవాడలోని చంద్రంపాలెం ప్రాంతానికి చెందిన డొడ్డి తులసిరామ్ (42)షిప్పింగ్ లైన్స్ ఫీల్డ్లో సూపర్వైజర్గా పనిచేస్తున్నారు.గురువారం ఉదయం ఆయన తన వాహనంపై మధురవాడ నుంచి విశాఖ వైపు వెళ్తున్నారు.ఈక్రమంలో యండాడ సమీపంలోని లా కాలేజ్ రోడ్ జంక్షన్ వద్దకు చేరుకోగానే,వాహనంపై నియంత్రణ కోల్పోయి ఒక్కసారిగా డివైడర్ను బలంగా ఢీకొట్టారు.ప్రమాద ధాటికి తులసిరామ్ రోడ్డుపై పడిపోవడంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి చికిత్స నిమిత్తం ఆయనను సమీపంలోని గాయత్రి ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో ఉదయం 11 గంటల సమయంలో ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. మృతుడి తండ్రి డొడ్డి పిల్లప్ప ఇచ్చిన ఫిర్యాదు మేరకు పీ.ఎం.పాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ గేదెల బాలకృష్ణ ఆధ్వర్యంలో పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు.
