విశాఖ చేరుకున్న అథ్లెట్ ఓం సతీజా
భారతీయ–ఆస్ట్రేలియన్ ఎండ్యూరెన్స్ అథ్లెట్ ఓం సతీజా చేపట్టిన “వన్ ఇండియా రన్” సోమవారం విశాఖపట్నం చేరుకుంది. ఈ సందర్భంగా ఫోర్ పాయింట్స్ బై షెరటాన్ హోటల్ బాంక్వెట్ హాల్లో నిర్వహించిన పత్రికా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు.
యువతలో స్ఫూర్తి నింపడం, సమాజ సేవకు ప్రోత్సాహం కల్పించడం లక్ష్యంగా దేశవ్యాప్తంగా 5,000 కిలోమీటర్ల పరుగు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు సాగుతున్న ఈ పరుగు ద్వారా భారతదేశ తూర్పు తీరం వెంబడి పరుగెత్తిన తొలి వ్యక్తిగా నిలవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు.
ఇప్పటివరకు 32 రోజుల్లో 1,520 కిలోమీటర్లు పూర్తి చేసి రోజుకు సుమారు 50 కిలోమీటర్ల వేగంతో పరుగు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఉదయాన్ ఫౌండేషన్ కోసం రూ.60 లక్షల నిధులు సేకరించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.
అట్టడుగు వర్గాలు మరియు కుష్టు వ్యాధి ప్రభావిత కుటుంబాల పిల్లల విద్య కోసం ఈ నిధులు వినియోగించబడనున్నాయని తెలిపారు. ఇప్పటికే దాదాపు రూ.20 లక్షలు సేకరించినట్లు ఆయన వెల్లడించారు.
ఈ కార్యక్రమం ద్వారా ఆరోగ్యం, సామాజిక బాధ్యతపై అవగాహన పెరుగుతుందని ఓం సతీజా ఆశాభావం వ్యక్తం చేశారు.
