12వ రోజు ప్రవచన యజ్ఞంలో సామవేదం షణ్ముఖ శర్మ
భాగవతంలో రాధ శ్రీకృష్ణ పరమాత్ముడికి గూఢ నాయకి అని వాగ్ధేవీ వరపుత్ర సామవేదం షణ్ముఖ శర్మ అన్నారు. ఋషి పీఠం, సత్సంగం, విశాఖపట్నం ఆధ్వర్యాన ఎంవీపీ కాలనీ, ఆరో సెక్టార్, ఎబీసీ పార్కులో 14 రోజుల శ్రీమద్భాగవవ ప్రవచన యజ్ఞం 12వ రోజైన సోమవారం సాయంత్రం ప్రవచనకర్త వృషభాను కుమార్తె రాధా దేవి చరిత్ర బృందావన రసయోగులకు తెలుస్తుందన్నారు. శరత్తు రాత్రిలో శ్రీ కృష్ణ పరమాత్ముడి వేణుగానం, ధర్మోపదేశం వినే యోగం పరమాత్మ అనుగ్రహం పొందినవారికి మాత్రమే లభించిందన్నారు. రాసలీల, సిద్ధ లీల, యోగలీల, ఫలలీల అనేవి అర్థం చేసుకోవడం అందరివల్లా కాదన్నారు. అంతర్థానమైన శ్రీకృష్ణ పరమాత్ముని వెతుక్కుంటూ రాత్రివేళ వనం నుంచి వనంలోకి వెళ్లిన గోపికలకు కొంత దూరం వెళ్లాక స్వామి అడుగు జాడలు కనిపించాయన్నారు. ఆ తర్వాత స్వామి పాదాలతోపాలు ఒక దివ్య స్త్రీ అడుగులు కనిపించాయి ఆమెయే రాధ అని వివరించారు. రాధాదేవి సర్వ శక్తుల స్వరూపం. భగవత్ సాన్నిహిత్యం వల్ల, భగవదానుగ్రహం వల్ల ప్రసరించే ప్రేమ పేరే కారుణ్యం అని సామవేదం చెప్పారు. ప్రేమ రాధ స్వరూపం. రాధాదేవి అనుమతి తోనే శుద్ధమైన భక్తి లభిస్తుందన్నారు. రాధా కృష్ణుల ప్రణయం ఒక దివ్యమైన అనుభూతి రాధా తత్వమే గోపీ తత్వమని ఆయన చెప్పారు. రాధ శబ్ధం వ్యుత్పత్యర్ధం సామవేదంలో ఉంటుందన్నారు. అన్ని అభీష్టాలూ నెరవేర్చేదే రాధ. మనస్సు నిండా పరమాత్మ తత్వమే నిండి ఉంటే మరే ఇతర కోరికలు ఉండవని దానికి అర్థం చెప్పారు. గోపికలు (యోగినులు) బ్రహ్మకామనతో తపించేవారు. రసేశ్వరి, రస నాయకి అనే ఇతర పేర్లు కూడా రాథకు ఉన్నాయని రాసలీలకు అధిష్టాత దేవిగా, రసమండల నాయకిగా ఆమెను అభివర్ణించారు. రాధా కృష్ణులను బృందావనంలో యుగళ కిశోరం అని పిలుస్తారని వాళ్లిద్దరూ 12 ఏళ్ల వయస్సువారిలాగే అందరికీ అగుపిస్తారని సామవేదం చెప్పారు. బృందావనాన్ని ఆశ్రయించినవారికి లౌకిక సుఖాలు అక్కర్లేదని ఆయన పేర్కన్నారు. భక్తిలో ఆచార్య స్థానం గోపికలదే. ఉత్కృష్ణమైన చిత్త వృత్తికి భక్తికి గోపికలను ఉదాహరిస్తారన్నారు. బృందావనంలో చెప్పుకోదగ్గ రాధా కృష్ణ ఆలయాలు ఐదువేల పై చిలుకు ఇప్పటికీ ఉంటాయని సామవేదం వివరించారు.
