రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఫైర్
* రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ నిలిచిపోవడానికి ప్రధాన కారణం జగనే..
* ఆనాడే ఇదే విషయమై వైసీపీ శ్రేణులు నిలదీయాల్సింది
కమిషన్ల పేరుతో దోచుకోవడానికే రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణానికి జగన్ తెర తీశాడు… ఎన్జీటీ అడ్డుకోవడంతో ఆ కుట్ర విఫలమైంది… 2020 అక్టోబర్ లో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ నిలిపేయాలంటూ ఎన్జీటీ స్టే ఇస్తే, ఆ తరవాత మూడేళ్ల పాటు అధికారంలో ఉన్న జగన్ ఆ ప్రాజెక్టు గురించి ఎందుకు పట్టించుకోలేదు…. ఇదే విషయమై ఆనాడే జగన్ ను వైసీపీ శ్రేణులు నిలదీసి ఉంటే… రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తయ్యి ఉండేది..’ అని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత స్పష్టం చేశారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ నిలిచిపోవడానికి ముమ్మాటికీ జగనే కారణమని, రౌండ్ టేబుళ్ల సమావేశాలంటూ ఇప్పుడు వైసీపీ శ్రేణులు చేస్తున్నదంతా డ్రామాలేనని విమర్శించారు. రాయలసీమను అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉండేలా సీఎంచంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారన్నారు. శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ క్యాంపు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి సవిత మాట్లాడారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పేరుతో వైసీపీ నాయకులు, కార్యకర్తలు డ్రామాలు ఆడుతున్నారన్నారు. వారి రౌండ్ టేబుళ్ల సమావేశాల డ్రామాలు ప్రజలు గుర్తించారని, వైసీపీ కుట్రలను పట్టించుకునే పరిస్థితుల్లో లేరని అన్నారు. కమిషన్ల కక్కుర్తి కోసం ఎటువంటి అనుమతులు లేకున్నా, రాయలసీమ ఎత్తిపోతల పథకానికి తన హయాంలో జగన్ ప్రారంభానికి సిద్దమయ్యారన్నారు. తెలంగాణాలో అధికారంలో ఉన్న ఆనాటి బీఆర్ఎస్ నాయకులు ఎన్జీటీకి వెళ్లడంతో, ఎత్తిపోతల పథకానికి కోర్టు అడ్డు చెబుతూ, ప్రాజెక్టు పనులు నిలిపేయాలని 2020న ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. దీంతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఎక్కడవక్కడ నిలిచిపోయాయన్నారు. కోర్టు ఉత్తర్వుల తరవాత జగన్… రాష్ట్రంలో మరో మూడేళ్లు అధికారంలో ఉన్నారన్నారు. కనీసం ఆయన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ప్రారంభానికి ఎటువంటి చర్యలూ తీసుకోలేదని మంత్రి సవిత విమర్శించారు.
ఆనాడే జగన్ ను నిలదీసి ఉండాల్సింది…
జగన్ అవినీతి, అసమర్థ నిర్ణయాల వల్ల రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ నిలిచిపోయిందన్న విషయం అందరికీ తెలిసిందేనని మంత్రి సవిత గుర్తు చేశారు. ఇదే విషయమై ఆనాడే జగన్ ను రాయలసీమ ప్రాంతానికి చెందిన వైసీపీ నాయకులు నిలదీయాల్సి ఉండాల్సిందన్నారు. జగన్ తీరుతో రాయలసీమ ప్రజలకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. ఆనాడు పట్టించుకోవడం మానేసి, ఇప్పుడు రౌండ్ టేబుల్ సమావేశాలంటూ డ్రామాలు ఆడుతున్నారన్నారు. వైసీపీ నాయకుల చేష్టలను ప్రజలు పట్టించుకునే పరిస్థితుల్లో లేరన్నారు. జగన్ రాయలసీమ ద్రోహి అని మంత్రి సవిత తీవ్రంగా మండిపడ్డారు. ప్రస్తుతం రాయలసీమకు తాగు, సాగునీరందించిన ఘనత సీఎం చంద్రబాబుదేనన్నారు. వైసీపీ నాయకుల పొలాలకు నీరు వస్తుందంటే అది కూడా సీఎం చంద్రబాబు చలవేనని మంత్రి సవిత స్పష్టంచేశారు.
