- అన్నదాత సంక్షేమం ప్రభుత్వ లక్ష్యం
- రైతన్న మీ కోసం వారోత్సవాల్లో గంటా
ఆనందపురం, జయ జయహే : రైతును రాజుగా చూడాలనే లక్ష్యంతో ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. రైతన్న మీ కోసం వారోత్సవాల్లో భాగంగా ఆనందపురం మండలం గొట్టిపల్లి పంచాయతీ చీమల మెట్టపాలెం గ్రామంలో బుధవారం ఆయన పర్యటించారు. పలువురు రైతుల ఇళ్లకు వెళ్లి ప్రభుత్వం నుంచి అందుతున్న సహాయ సహకారాల గురించి ఆరా తీశారు. అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ పథకం కింద రెండు విడతలుగా ఇచ్చిన రూ.14 వేలు ఖాతాల్లో జమ అయ్యాయా అని అడిగారు. అధిక పంట దిగుబడి కోసం వ్యవసాయ అధికారులు అందజేస్తున్న సలహాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఎరువులు, విత్తనాలకు సంబంధించి సరఫరాలో సమస్యలు తలెత్తకుండా ప్రభుత్వ పరంగా తీసుకుంటున్న చర్యలను వివరించారు. రైతు తను పండించుకునే పంటకు ధర నిర్ణయించుకునే స్వేచ్ఛ రావాలని ఆకాంక్షించారు. రైతును, వ్యవసాయ రంగాన్ని అగ్రస్థానంలో నిలపడానికి సీఎం చంద్రబాబు నాయుడు కృషిని వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. సాంకేతికత, నీటి భద్రత, డిమాండ్ ఉన్న పంటల సాగు, విలువ ఆధారిత ఉత్పత్తుల సాగు ద్వారా రైతులకు ఆర్థిక భరోసా లభించేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందించిందని గంటా తెలియజేశారు. కార్యక్రమంలో భీమిలి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కురుమిన రామస్వామి నాయుడు, కూటమి నాయకులు బి.ఆర్.బి.నాయుడు, పాండ్రంగి అప్పలరాజు, శాఖారి శ్రీనివాస్, గండ్రెడ్డి సోమినాయుడు, రౌతు నాగరాజు, కర్రి శ్రీనివాస్, కోరాడ వైకుంఠం తదితరులు పాల్గొన్నారు.
బంగారమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట

భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వెంకటాపురంలో కొత్తగా నిర్మించిన బంగారమ్మ తల్లి ఆలయాన్ని బుధవారం సందర్శించి విగ్రహ ప్రతిష్ట చేశారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. పెద్దఎత్తున భక్తులు హాజరయ్యారు. నిర్వాహకులు భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు.
.
