యువగళం పాదయాత్ర రాష్ట్ర రాజకీయ చరిత్రలోనే ఒక సంచలనమని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. రాష్ట్ర ఐటీ, విద్య శాఖా మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రకు మూడేళ్లు పూర్తైన సందర్భంగా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన వేడుకలకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రాన్ని మరియు తెలుగుజాతిని కాపాడాలనే సంకల్పంతో చేపట్టిన ఈ పాదయాత్ర ప్రజల్లో అపూర్వ స్పందనను పొందిందని చెప్పారు.
226 రోజుల పాటు 3132 కిలోమీటర్లు నడిచి, 97 నియోజకవర్గాలు, 2094 గ్రామాల్లో ప్రజల గుండె తలుపులు తట్టిన యువగళం బడుగులు, బలహీనులు, పేదలు, మహిళలు, యువకులు, రైతుల కష్టాలను ప్రత్యక్షంగా తెలుసుకుందన్నారు. సుమారు 1.5 కోట్ల మందితో నేరుగా మమేకమైన ఈ పాదయాత్ర కూటమి అధికారంలోకి రావడంలో గేమ్చేంజర్గా మారిందని పేర్కొన్నారు. వైసీపీ అరాచక పాలనకు యువగళం తుదిముద్ర వేసిందని ఆయన స్పష్టం చేశారు.
