గంజాయి, డ్రగ్స్ జోలికి పోవద్దు:
యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని గంజాయి, డ్రగ్స్ వంటి వాటి జోలికి పోవద్దని స్థానిక పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ ఎల్ సురేష్ అన్నారు. మండలంలోని తూటంగి గ్రామ పంచాయతీ కేంద్రంలో ఆదివారం గ్రామ యువత, గ్రామ ప్రజలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ ఎల్ సురేష్ మాట్లాడుతూ గ్రామస్తులు, యువత గంజాయి సాగు చేయడం, రవాణా చేయడం వంటి వాటికి దూరంగా ఉండాలని అన్నారు.రోడ్డు భద్రత నియమాలు కూడా పాటించాలని యువతకు సూచించారు. వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్ లు కలిగి ఉండాలని చెప్పారు.ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ఇద్దరికంటే ఎక్కువమంది ద్విచక్ర వాహనాల్లో ప్రయాణించరాదని చెప్పారు.అధిక వేగంతో వాహనాలు నడప రాదని సూచించారు. అంతేకాకుండా ఆటోలు నడిపే డ్రైవర్లందరూ పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించరాదని చెప్పారు. డ్రైవింగ్ లైసెన్సులు లేని డ్రైవర్లంతా డ్రైవింగ్ లైసెన్సులు చేసుకోవాలని అన్నారు. అంతేకాకుండా వాహనాలకు సంబంధించి అన్ని రికార్డులు తప్పనిసరిగా ఉంచుకోవాలని వాహనదారులను సూచించారు. సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని యువతకు సూచించారు. సెల్ ఫోన్లలో పంపించే లింకులను ఓపెన్ చేయరాదని తెలియని వ్యక్తులు పంపించే ఓటీపీలను చెప్పవద్దని చెప్పారు. లేదంటే తమ వ్యక్తిగత వివరాలను సైబర్ నేరగాళ్లు హ్యాకింగ్ చేసి తమ బ్యాంకు ఖాతాలను ఖాళీ చేసే అవకాశం ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో తూటంగి గ్రామస్తులు, యువత, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
