- మీరు ఇక రారు.. ఆశలు పెట్టుకోవద్దు
- మరో 15 ఏళ్ళు సాగేది కూటమి పాలన
- మేమే వస్తాం.. అంతు చూస్తాం అంటే కుదరదు
- పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి
- వైసీపీకి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఘాటు హెచ్చరిక
(రాజోలు – జయజయహే)
ప్రజా క్షేత్రంలో ఓటు అనే ఆయుధంతో ప్రజలు బుద్ధి చెప్పినా వైసీపీ నాయకుల్లో మార్పు రావడం లేదని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వైసీపీ నేతలపై మండిపడ్డారు. రాజోలులో పల్లె పండుగ 2.0 పనుల ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. వైసీపీ వాళ్ల బూతులు మారడం లేదు. వాళ్ల బుద్ధి మారడం లేదు. 2029లో మళ్లీ మేమే వస్తాం. అంతు తేలుస్తాం. అని సామాజిక మాధ్యమాల్లో ఇష్టానుసారం రెచ్చిపోతున్నారని మండిపడ్డారు. వైసీపీ నాయకుల తీరుపై పిఠాపురంలో ఒకసారి మాట్లాడాను. మరోసారి చెబుతున్నాను.. నోరుంది కదా అని ఇష్టానుసారం పిచ్చి పిచ్చి ప్రేలాపనలు పేలితే పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.
2029లో మళ్లీ మేము వస్తామని కలలుకంటున్న వైసీపీ బ్యాచ్ కు రాజోలు గడ్డ నుంచి ఒకటే చెబుతున్నాం… మీరు రారు. అలాంటి ఆశలు పెట్టుకోకండి. అవి జరగవు. రాష్ట్రంలో మరో 15 ఏళ్లు కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని అన్నారు. “జెన్ జి” యువత ఆలోచనల్లో చాలా మార్పు వచ్చింది. అబద్దపు హామీలుతో వారిని మోసం చేయలేము. బీహార్ ఎన్నికల్లో లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఆశ చూపినా ఆర్జేడిని ఓడించారు. మునుపటి తరంతో పోల్చుకుంటే జెన్ జి యువత చాలా భిన్నం. సంక్షేమ పథకాలతో ప్రభుత్వాన్ని నడిపిస్తామంటే కుదరదు. సంక్షేమంతో పాటు అభివృద్ధిని చేసి చూపించాలి. ఉపాధి కల్పించాలి. సంక్షేమ పథకాలు తగ్గి ఉపాధి అవకాశాలు మెరుగైతేనే నిజమైన అభివృద్ధి. ఎక్కువ శాతం ప్రజలు సంక్షేమం అవసరం లేని పరిస్థితిలో ఉండాలన్నారు. స్వయం శక్తి మీద నిలబడే భారతదేశం కావాలి. ఎవరికి తలవంచని యువ భారతం కోరుకుంటున్నానన్నారు.
సమాజం పట్ల… దేశం పట్ల… మన సంస్కృతి పట్ల బాధ్యతగా ఉంటేనే ఎవరికైనా ప్రశ్నించే హక్కు వస్తుంది. రాజ్యాంగ దినోత్సవం నాడు ఒకటే సందేశం ఇస్తున్నాను. యువత సమాజం పట్ల బాధ్యతగా నిలబడితేనే రాజకీయ నాయకులను నిలదీసే హక్కు ఉంటుంది. ప్రజాస్వామాన్ని గౌరవించని నాయకులను ఉపేక్షించను. అది జనసేన నాయకులైనా సరే అని స్పష్టం చేశారు.
నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక తరహాలో ఇక్కడ విప్లవాలు వస్తాయని కొంతమంది నాయకులు కలలు కంటున్నారు. గత ప్రభుత్వం ఇంకో ఏడాది అధికారంలో ఉంటే అలాగే జరిగేది. కానీ అదృష్టవశాత్తు ఎలాంటి గొడవలు లేకుండానే ఓటు అనే ఆయుధంతో యువత ప్రభుత్వాన్నే మార్చేశారుని అన్నారు.
